logo

Guntur: తల్లితో ఆస్తి వివాదం.. అందరూ చూస్తుండగానే నిప్పటించుకున్న కుమార్తె

ఇంటి హద్దుల విషయమై తల్లి, అక్కతో తలెత్తిన గొడవలో చెన్నా సుజాత(45) అనే మహిళ పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకొని మృతి చెందారు.

Updated : 29 May 2023 11:56 IST

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: ఇంటి హద్దుల విషయమై తల్లి, అక్కతో తలెత్తిన గొడవలో చెన్నా సుజాత(45) అనే మహిళ పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకొని మృతి చెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఆదివారం చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాడుకు చెందిన ఆదిలక్ష్మికి స్థానికంగా ఇల్లు ఉంది. అందులోని ఒక భాగంలో ఆమె చిన్న కుమార్తె చెన్నా సుజాత తన భర్త నరేశ్‌బాబు, కుమారుడు, కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. మరో భాగంలో తల్లి ఆదిలక్ష్మి నివసిస్తున్నారు. ఈ క్రమంలో తల్లిని సుజాత కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని తెలిసి ఆదిలక్ష్మి పెద్ద కుమార్తె కోటేశ్వరి కుటుంబ సమేతంగా వచ్చి తల్లితో పాటు ఉంటున్నారు. ఈ క్రమంలో హద్దుల విషయంలో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

గత జనవరిలో తన చిన్న కుమార్తె సుజాత, ఆమె భర్త నరేశ్‌బాబు, పిల్లలు దాడి చేశారని ఆదిలక్ష్మి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ గొడవల నేపథ్యంలో ఆదివారం రెండు పోర్షన్ల మధ్య హద్దు గోడ నిర్మించేందుకు ఆదిలక్ష్మి, కోటేశ్వరి కూలీలను తీసుకొచ్చారు. దీంతో ఆగ్రహించిన సుజాత పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నారు. ఆమెను కాపాడేందుకు కుటుంబసభ్యులు, చుట్టు పక్కల వారు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 108 వాహన సిబ్బంది వచ్చి ఆమెను పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. నరేశ్‌బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీంద్రబాబు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని