logo

ప్రజలు ఆదరిస్తే కళలకు భవిష్యత్తు

కళాకారులను ప్రోత్సహించేందుకు పరుచూరి రఘుబాబు మెమోరియల్‌ ట్రస్టు ద్వారా ఏటా నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు ట్రస్టు ఆర్గనైజరు, సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు.

Published : 29 May 2023 04:35 IST

పల్లెకోనలో అఖిల భారత నాటకోత్సవాలు ప్రారంభం

భట్టిప్రోలు, న్యూస్‌టుడే: కళాకారులను ప్రోత్సహించేందుకు పరుచూరి రఘుబాబు మెమోరియల్‌ ట్రస్టు ద్వారా ఏటా నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు ట్రస్టు ఆర్గనైజరు, సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని పల్లెకోన గ్రామంలో పరుచూరి రఘుబాబు, టీఎస్‌ఆర్‌ లలిత కళాపరిషత్‌ కళామండపంలో ఆదివారం రాత్రి అఖిల భారత నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో నాటకరంగంపై ఆసక్తి పెంచేందుకు పల్లెకోనలో నాటకోత్సవాలు ప్రారంభించామని తెలిపారు. గతంలో హైదరాబాద్‌ కళాభారతిలో నిర్వహించామన్నారు. ప్రజలు ఆదరిస్తే కళలు, కళాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. నాటక రంగంలో ప్రతిభ చూపినవారు సినీరంగంలోనూ ప్రవేశించారని గుర్తుచేశారు. కళాకారుల పట్ల రఘుబాబుకి ఎంతో ఇష్టం ఉండేదన్నారు. కళారచయిత, దర్శకుడు తులసి బాలకృష్ణ మాట్లాడుతూ ఎంతోమంది కళాకారులను ప్రోత్సహించిన ఘనత పరుచూరి బ్రదర్స్‌కు ఉందన్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా కళాకారుల పట్ల ఉన్న అభిమానంతోనే పోటీలు నిర్వహించటం అభినందనీయమని తెలిపారు. 2012లో ప్రారంభమైన పోటీలు ఏటా విజయవంతంగా జరుగుతున్నాయంటే వారి కృషేనని పేర్కొన్నారు. తొలుత రఘుబాబు చిత్రపటం వద్ద వెంకటేశ్వరరావు కుమార్తె పద్మజ పూలమాల వేసి నివాళులర్పించారు.


యువతకు స్ఫూర్తి ‘ఎర్రకలువ’

నేటి యువతకు ‘ఎర్రకలువ’ నాటకం ఎంతో స్ఫూర్తినిచ్చింది. చాలామంది ఉన్నత చదువులు చదివి విదేశాలకు తరలిపోవడం వల్లే మనదేశం అభివృద్ధి చెందలేదని రచయిత ఆకురాతి భాస్కర్‌చంద్ర నాటక రూపంలో చూపారు. మనచుట్టూ ఉన్న ఇతర దేశాలు సాంకేతిక అభివృద్ధిలో ముందుంటే మనం వెనుకబడుతున్నామనే అంశాన్ని కళ్లకు కట్టారు. నాటకంలో యువ ఇంజినీరు కథనం ఎర్రకలువ ద్వారా చూపారు. భవిష్యత్తులో మనం కన్న కలలు మనదేశంలో నెరవేర్చుకోవచ్చనటానికి ఈ నాటకం నిదర్శనం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని