లబ్ధిదారులకు పట్టాలు... భగవంతుడికి చెత్త కాగితాలు
ఆలయ సమీపంలో సీఎం జగన్ ఆర్భాటంగా సభ నిర్వహించారు. ఆనక చెత్త వదిలేసి ఎవరికి వారు వెళ్లిపోయారు. మూడు రోజులవుతున్నా అధికారులు, స్థానిక నాయకులు సైతం పరిసరాలు శుభ్రం చేయించలేదు.
వెంకటేశ్వరస్వామి ఆలయం ఎదుట బహిరంగ సభ నిర్వహించిన ప్రాంతంలో పేరుకున్న చెత్త
తుళ్లూరు, న్యూస్టుడే: ఆలయ సమీపంలో సీఎం జగన్ ఆర్భాటంగా సభ నిర్వహించారు. ఆనక చెత్త వదిలేసి ఎవరికి వారు వెళ్లిపోయారు. మూడు రోజులవుతున్నా అధికారులు, స్థానిక నాయకులు సైతం పరిసరాలు శుభ్రం చేయించలేదు. ఇంతటి అపరిశుభ్ర వాతావరణంలో నేడు ఆలయ ప్రథమ వార్షికోత్సవం ఏ విధంగా నిర్వహించాలని భక్తులు, రాజధాని రైతులు, నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 26న రాజధాని గ్రామం వెంకటపాలెం సమీపంలో తితిదే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట వైకాపా ప్రభుత్వం భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారులకు ‘నవరత్నాలు-పేదలందరికి ఇళ్లు’ పథకంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా 50,793 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభ నిర్వహించి మూడు రోజులు అవుతున్నా సభా స్థలంలోని చెత్తను ఇప్పటి వరకు శుభ్రం చేయలేదు. ఈ ప్రాంతంలో ప్లాస్టిక్ నీళ్ల సీసాలు, ప్యాకెట్లు, అల్ఫాహారం ప్యాకెట్లు, కాగితాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులకు భక్తులు చెత్తతో నిండిన పరిసరాల ఫొటోలు పంపారు. మంగళవారం ఆలయ వార్షికోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో శుభ్రం చేయించాలని కోరారు. దీంతో సోమవారం సాయంత్రం పారిశుద్ధ్య కార్మికులు హడావుడిగా వచ్చి శుభ్రం చేయటం ప్రారంభించి కొద్ది సేపటికే వెళ్లిపోయారు. ఇప్పటికీ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో నేడు వార్షికోత్సవం ఏ విధంగా నిర్వహించాలో అర్థం కావడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.