Chandrababu: తెదేపా అధికారంలో ఉంటే 2020 నాటికి పోలవరం పూర్తయ్యేది: చంద్రబాబు

తెలుగుజాతి పునర్నిర్మాణానికి కృషి చేయాల్సిన అవసరముందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.

Updated : 02 Jun 2023 19:14 IST

అమరావతి: తెలుగు ప్రజలు ఎక్కడున్నా అగ్రస్థానంలో ఉండాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజల కోసం నిరంతరం తెదేపా శ్రమించిందన్నారు. ఎన్టీఆర్‌.. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు. ఏపీలో రెండో తరం సంస్కరణలు తీసుకొచ్చామని వివరించారు. దేశానికి దశ దిశ నిర్దేశించిన వ్యక్తి పీవీ నరసింహారావు అని..1991లో పీవీ ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారన్నారు. అలాంటి వ్యక్తి తెలుగువారిగా మనందరికీ గర్వకారణమన్నారు. తెలుగుజాతి పునర్నిర్మాణానికి కృషి చేయాల్సిన అవసరముందని పునరుద్ఘాటించారు.  

‘‘నాడు సమైక్యాంధ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశా. సంపద సృష్టించి సంక్షేమ పథకాలను పేదలకు అందించాం. నాలెడ్జ్‌ ఎకానమీకి ఐటీ నాంది పలుకుతుందని ఆనాడే చెప్పాం. సంస్కరణలకు సాంకేతిక జోడించి ముందుకు వెళ్లాం. విభజన జరిగిన తర్వాత పరిపాలన, ప్రభుత్వ విధానాల ద్వారా ఎవరికీ ఇబ్బంది లేకుండా చేశాం. నవ నిర్మాణ దీక్ష పేరుతో నిర్దిష్ట లక్ష్యాలు పెట్టుకుని ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషిచేశాం. సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ దిశగా ముందుకెళ్లాం. విభజన వేళ ఏపీకి రూ.1.10 లక్షల కోట్ల అప్పు వచ్చింది. రూ.16వేల కోట్లు లోటు బడ్జెట్‌ ఉంది. సవాళ్లను అధిగమించి 2029 విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించాం. 2029 నాటికి ఏపీ నంబర్‌ వన్‌గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 

నదులు అనుసంధానిస్తే రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే వీలు కలుగుతుందని భావించాం. అందులో భాగంగానే రూ.64 వేల కోట్ల ఖర్చుతో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాం. పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తి చేశాం. 2025కి ఫేజ్‌-1 పూర్తి చేస్తామని సిగ్గు లేకుండా వైకాపా ప్రభుత్వం చెబుతోంది. ప్రాజెక్టు పూర్తవడానికి ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేని దుస్థితి ఏర్పడింది. ప్రజల జీవనాడి పోలవరాన్ని సర్వనాశనం చేసి రాష్ట్ర ప్రగతిని, మన భవిష్యత్తును అడ్డుకునే పరిస్థితికొచ్చారు. అదే తెదేపా అధికారంలో ఉండి ఉంటే 2020 జూన్‌ నాటికి పోలవరం పూర్తయ్యేది. 

ఆనాడు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మనం నెంబర్‌ వన్‌గా నిలిచాం. 2015లో రెండో స్థానంలో ఉండగా.. 2016, 2017, 2018, 2019 తర్వాత కూడా అగ్రస్థానంలో ఉన్నాం. ఈరోజు ఎఫ్‌డీఏలో రాష్ట్రం అధమ స్థానంలో ఉంది. ఐటీ ఎక్స్‌పోర్ట్స్‌లో 0.02 శాతంగా ఉంది. అదే తెలంగాణ రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రూ.లక్షా 83 కోట్లు. జగన్‌ పాలనలో యువత నిర్వీర్యం అయిపోయారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. గంజాయి క్యాపిటల్‌గా విశాఖను మార్చారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశాం. ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం’’ అని చంద్రబాబు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని