Sattenapalli: కోడెల కుటుంబానికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు: నక్కా ఆనందబాబు

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కోడెల శివరామ్‌తో తెదేపా త్రిసభ్య బృందం చర్చలు ముగిశాయి. కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి ఇన్‌ఛార్జి ఇవ్వటంపై కోడెల శివరామ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Updated : 02 Jun 2023 17:05 IST

సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కోడెల శివరామ్‌తో తెదేపా త్రిసభ్య బృందం చర్చలు ముగిశాయి. కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి ఇన్‌ఛార్జి ఇవ్వటంపై కోడెల శివరామ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై పార్టీ త్రిసభ్య బృందం శుక్రవారం శివరామ్‌ని కలిసింది. సమావేశం తర్వాత సీనియర్‌ నేతలు నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. కోడెల కుటుంబానికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని ఆనందబాబు తెలిపారు. 

సామాజిక సమీకరణల దృష్ట్యా కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి నియోజకవర్గ  పార్టీ ఇన్‌ఛార్జిగా  నియమించారని స్పష్టం చేశారు. శివరామ్‌తో పాటు కోడెల అభిమానులకు కొంత బాధ ఉంటుందని, దాన్ని తీర్చేందుకు పార్టీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. శివరామ్‌ని చంద్రబాబు త్వరలో పిలిచి మాట్లాడుతారని జీవీ ఆంజనేయులు చెప్పారు.  పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. శివరామ్‌తో మాట్లాడి వెళుతుండగా త్రిసభ్య బృందాన్ని శివరామ్‌ అనుచరులు కాసేపు అడ్డుకున్నారు. వాహనాల ముందు బైఠాయించి శివరామ్‌ని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. నిరసన తెలిపిన కార్యకర్తలకు నచ్చజెప్పి నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని