logo

హజ్‌ యాత్రకు వేళాయె

ప్రతి ముస్లిం తన జీవితంలో కచ్చితంగా అనుసరించాల్సిన ఐదు నియమాల్లో హజ్‌ యాత్ర ఒకటి. ఇస్లాం ధర్మంలో ఒకసారి హజ్‌ చేయడం తప్పనిసరి.

Published : 07 Jun 2023 04:32 IST

7 నుంచి ప్రయాణం
నంబూరులో యాత్రికులకు వసతి
సత్తెనపల్లి, న్యూస్‌టుడే

యాత్రికులకు వసతి కల్పించే నంబూరు మదర్‌సా ప్రాంగణం

ప్రతి ముస్లిం తన జీవితంలో కచ్చితంగా అనుసరించాల్సిన ఐదు నియమాల్లో హజ్‌ యాత్ర ఒకటి. ఇస్లాం ధర్మంలో ఒకసారి హజ్‌ చేయడం తప్పనిసరి. బక్రీద్‌ నెలలో చేసే యాత్ర హజ్‌ అని, సాధారణ రోజుల్లో చేసే యాత్ర ఉమ్రా అని పిలుస్తారు. ఈ ఏడాది హజ్‌ యాత్రకు రాష్ట్రం నుంచి 2,000 మందికిపైగా వెళ్తున్నారు. తొలిసారి గన్నవరం విమానాశ్రయం నుంచి ముస్లిం సోదరులు వెళ్లనున్నారు. యాత్ర చేయబోయే అందరికీ పెదకాకానికి మండలంలోని నంబూరు మదర్‌సాలో వసతి ఏర్పాట్లు చేశారు. ఈనెల 7 నుంచి యాత్ర మొదలుకానుంది. ఈ నేపథ్యంలో హజ్‌ యాత్ర ఎలా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కమిటీ అందిస్తున్న సౌకర్యాలేంటి, యాత్రికులు పాటించాల్సిన నియమాలు తదితర అంశాలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

19 వరకు విమాన సర్వీసులు

ఈనెల 7 నుంచి 19 వరకు హజ్‌ యాత్రికుల్ని తీసుకెళ్లే ప్రత్యేక విమానాలు గన్నవరం నుంచి నడవనున్నాయి. 17 వరకు ప్రభుత్వ రాయితీపై తీసుకెళ్లే యాత్రికుల్ని అనుమతించనున్నారు. మిగిలిన రెండ్రోజులు సొంత ఖర్చులతో వెళ్తున్న వారికి ప్రయాణ అవకాశం కల్పిస్తారు. ప్రయాణానికి ఒకరోజు ముందుగానే నంబూరు మదర్‌సాలో యాత్రికులు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. రిపోర్టు చేసిన తర్వాత వారికి విడిది, భోజనాలు, వసతితోపాటు పోలీసు బందోబస్తుతో విమానం ఎక్కించే వరకు బాధ్యతలన్నీ హజ్‌ కమిటీ చూస్తుంది.

యాత్రకు సిద్ధమవ్వండిలా..

* అల్లాహ్‌, మహమ్మద్‌ ప్రవక్తపై భక్తి, ఆధ్యాత్మిక చింతనతోనే యాత్ర చేయాలి. వ్యాపారం, వినోదం కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. మహిళ అయితే ప్రయాణంలో తండ్రి, సోదరులు, భర్త.. వీరిలో ఎవరో ఒకరు తోడుగా ఉండాలి.
* కేంద్ర హజ్‌ కమిటీ నుంచి యాత్రికులకు ఆరోగ్య కార్డులు పంపిణీ చేశారు. కార్డుపై హజ్‌ యాత్రికుడి పేరు, కవర్‌ నంబరు, జనన తేది, శిక్షణ తీసుకున్న వివరాలు, టీకా, చుక్కల మందు తీసుకున్న వివరాలు, బ్యాచ్‌ నంబరుతోపాటు స్థానిక జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి సంతకం ఉంటుంది. యాత్రికుడి ఆరోగ్య వివరాలు ప్రత్యేకంగా నమోదు చేస్తారు. హజ్‌ యాత్ర పూర్తై తిరిగి స్వదేశానికి వచ్చేవరకు కార్డును యాత్రికులు తమవద్ద జాగ్రత్తగా ఉంచుకోవాలి.
* మక్కాకు లక్షలాదిమంది వస్తారు. అక్కడ మన యాత్రికులు తప్పిపోకుండా రాష్ట్ర హజ్‌ కమిటీ ఎలక్ట్రానిక్‌ బ్రేస్‌లెట్లను అందజేస్తుంది. జీపీఆర్‌ఎస్‌ విధానంతో పనిచేసే ఈ బ్రేస్‌లెట్‌తో యాత్రికుడు ఎక్కడున్నా తెలుసుకోవడం సులభమవుతుంది.
* ప్రతి యాత్రికుడు రూ.50 వేలు చెల్లిస్తే వాటికి సరిపడా సౌదీ డబ్బులు(రియాల్‌) హజ్‌ హౌస్‌లో అందిస్తారు. ఈ నగదును భోజనాలు, ఖుర్బానీకి మాత్రమే వినియోగించాలి.

అత్యవసర సేవలకు..

అంతర్జాలం ద్వారా హజ్‌ యాత్రికులకు విలువైన సేవల్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. www.hajcommittiee.gov అని క్లిక్‌చేస్తే యాత్రకు సంబంధించిన సమస్త వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఈ వెబ్‌సైట్‌లో కిందిభాగంలో కనిపించే ఎంక్వయిరీ బాక్సుల్లో కవర్‌ నెంబరు, పాస్‌పోర్టు నెంబరు నమోదుచేస్తే ప్రయాణ సమగ్ర వివరాలు ఇట్టే తెలిసిపోతాయి. మరిన్ని సేవలకు హజ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సెంటర్‌ 02222107070ను సంప్రదించవచ్చు. రాష్ట్ర హజ్‌ కమిటీ టోల్‌ఫ్రీ నంబరు 18004257873కు ఫోన్‌చేసి కూడా సేవలు పొందవచ్చు.


అవగాహనే కీలకం

ఇప్పటివరకు 11 సార్లు హజ్‌ యాత్ర చేశా. మరోసారి అల్లాహ్‌ దయతో వెళ్లబోతున్నా. యాత్ర ఎలా చేయాలనే విషయాలపై ముందుగానే అవగాహన పెంపొందించుకుంటే 30 నుంచి 40 రోజుల యాత్రలో ఎలాంటి ఇబ్బందులుండవు. హజ్‌కు వెళ్లే అవకాశం దక్కడం అల్లాహ్‌ కృపగా యాత్రికులు భావించాలి. రాష్ట్ర హజ్‌ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ముఫ్తీ అబ్దుల్‌ బాసిత్‌, ఏపీ హజ్‌ కమిటీ డైరెక్టర్‌, గుంటూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని