logo

పోషకాహార లోపం.. శాపం

బాల్యం బక్కచిక్కుతోంది. పోషకాహారలోపం సమస్య వారిని వెంటాడుతోంది. రూ.కోట్లు ఖర్చవుతున్నా బాలలు పుష్టిగా తయారవ్వట్లేదు. మరోవైపు కాబోయే అమ్మల్లో రక్తహీనత ఎక్కువగా ఉంది.

Published : 07 Jun 2023 04:32 IST

జిల్లాలో 6,219 మందికి సమస్య
ఐసీడీఎస్‌ ప్రత్యేక సర్వేలో వెల్లడి
సత్తెనపల్లి, న్యూస్‌టుడే

అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహారం తింటున్న బాలలు

బాల్యం బక్కచిక్కుతోంది. పోషకాహారలోపం సమస్య వారిని వెంటాడుతోంది. రూ.కోట్లు ఖర్చవుతున్నా బాలలు పుష్టిగా తయారవ్వట్లేదు. మరోవైపు కాబోయే అమ్మల్లో రక్తహీనత ఎక్కువగా ఉంది. బాలల ఎదుగుదల, అమ్మల ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని ఐసీడీఎస్‌ ప్రత్యేక సర్వేలో వెల్లడైంది. గత నెల 1 నుంచి 31 వరకు పిల్లల ఎదుగుదల, గర్భిణుల్లో రక్తహీనత సమస్య గుర్తించేందుకు జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ప్రత్యేక సర్వే నిర్వహించారు. శాస్త్రీయంగా పిల్లల బరువు, ఎత్తు కొలతల్ని, గర్భిణుల నుంచి రక్త నమూనాల్ని సేకరించారు. జిల్లాలో పోషకాహార లోపంతో 6,219 మంది చిన్నారులు ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడైంది. మరో 14 వేల మందిలో మోస్తరు పోషకాహార లోపం ఉంది.

* మొత్తం చిన్నారుల్లో పోషకాహార లోపంతో 6,219 మంది (5.57 శాతం మంది) బాధపడుతున్నారు. వయసుకు తగ్గ ఎత్తులేని వారిలో ఈపూరు మండలంలో 8.96 శాతం మంది, బొల్లాపల్లిలో 7.10 శాతం, బెల్లంకొండలో 6.41 శాతం, రాజుపాలెంలో 6.06 శాతం మంది ఉన్నారు. వయసుకు తగ్గ బరువులేని వారిలో బెల్లంకొండ మండలంలో 5.09 శాతం, ఈపూరులో 4.86 శాతం, రాజుపాలెం మండలంలో 4.83 శాతం మంది నమోదయ్యారు.

గర్భిణులకు కష్టాలు

కాబోయే అమ్మల్ని రక్తహీనత సమస్య వేధిస్తోంది. గత నెల జిల్లాలో 12,261 మంది గర్భిణులు సర్వేలో నమోదయ్యారు. వారిలో 3,606 మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. తేలికపాటి రక్తహీనతతో 2,550 మంది, మోస్తరు 1,054 మంది, తీవ్ర రక్తహీనతతో ఇద్దరు బాధపడుతున్నట్లు గుర్తించారు. 12 మండలాల్లోని గర్భిణుల్లో 40 శాతమంది కంటే ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతున్నట్లు నమోదైంది. గత నెల పరీక్షలు చేయించుకున్న వారిలో పిడుగురాళ్లలో 50.13 శాతం, క్రోసూరులో 49.26 శాతం, బెల్లంకొండలో 48.92 శాతం మంది గర్భిణుల్లో రక్తహీనత సమస్య గుర్తించారు.

* వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ్‌ కింద పోషకాహారం అందజేస్తున్నా పిల్లల్లో ఎదుగుదల, గర్భిణుల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా నమోదయ్యేందుకు కారణాల్ని ఉన్నతాధికారులు అన్వేషించాల్సిన అవసరముంది. రేపటి పౌరుల్ని పుష్టిగా మార్చేందుకు శ్రద్ధ చూపించాలి. రక్తహీనత బారిన గర్భిణులు పడకుండా వారికి ఆరోగ్య అవగాహన కల్పించాలి.

వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ్‌ పౌష్టికాహారం ప్యాకెట్‌

శ్రద్ధ తీసుకుంటాం

పిల్లల్లో పౌషకాహార లోపం.. గర్భిణుల్లో రక్తహీనత లేకుండా చేసేందుకు ప్రణాళికాయుత చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్‌ పీడీ అరుణ చెప్పారు. ప్రత్యేక సర్వేలో వెల్లడైన అంశాలపై విశ్లేషించి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాటిని దిద్దుబాటు చేస్తామన్నారు. తీవ్ర పోషకాహార లోపం ఉన్న మండలాలతోపాటు కేంద్రాలపై శ్రద్ధ చూపిస్తామన్నారు. రక్తహీనత బారినపడకుండా ఎలాంటి పోషకాహారం తీసుకోవాలో అమ్మలకు అవగాహన కల్పిస్తామని పీడీ తెలిపారు.

సర్వే అంశాలు

జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు 2031
6 ఏళ్లలోపు  చిన్నారులు: 1,27,322
ప్రత్యేక సర్వేలో నమోదైన వారు 1,13,024
బరువు, ఎత్తు వివరాలు సేకరించిన పిల్లలు: 1,11,610

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని