logo

ఇదేం సంప్రదాయం

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 సెప్టెంబరు నెలలో ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Published : 10 Jun 2023 04:57 IST

నాలుగేళ్లుగా నిలిచిన యూనిఫాం పంపిణీ
ఆర్టీసీ కార్మికులపై రూ.4.42కోట్ల ఆర్థిక భారం

పొన్నూరు డిపోలో విధులు ముగిశాక సేద తీరుతూ...

* మంగళగిరి డిపోనకు చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్‌కు నెలకు రూ.35వేలు జీతం వస్తుంది. వ్యక్తిగత అవసరాల నిమిత్తం బ్యాంకులో రుణం తీసుకున్నారు. ఆ రుణం కింద ప్రతి నెలా రూ.20వేలు బ్యాంకు ఖాతాకు జమ అవుతున్నాయి. మిగిలిన రూ.15వేలతో కుటుంబ భారాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ పరిస్థితుల్లో యూనిఫాం చినిగిపోవడంతో  రూ.4వేలు అప్పు చేసి రెండు జతల ఖాకీ దుస్తులు కుట్టించుకున్నట్లు వాపోయారు.

* పొన్నూరు ఆర్టీసీ డిపోలో 210 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ సుమారు రూ.5.5 లక్షల ఆదాయాన్ని ఆర్టీసీ బస్సుల ద్వారా సమకూర్చుతున్నారు. ఏడాదిలో ఒకటిన్నర రోజు ఆదాయాన్ని ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కేటాయిస్తే ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫాం ఇచ్చే వెసులుబాటు ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో కార్మికులపైన అదనపు భారం పడుతోందని కార్మికులు మనోవేదనకు గురవుతున్నారు.

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 సెప్టెంబరు నెలలో ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు ప్రజా రవాణా సంస్థగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతోనైనా కొంత ఆర్థికపరంగా వెసులుబాటు కలుగుతుందని కార్మికులు సంబర పడ్డారు. కానీ రానురాను ప్రజా రవాణా సంస్థలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు కష్టాలు మొదలయ్యాయి. ప్రతి ఏడాది డ్రైవర్‌, కండక్టర్‌కు రెండు జతల ఖాకీ యూనిఫాం, మెకానిక్‌ విభాగంలో పనిచేసే కార్మికులకు బులుగు యూనిఫాంను పంపిణీ చేయాల్సి ఉంది. నాలుగేళ్లుగా ఈ ప్రక్రియను కాగితాలకే పరిమితం చేశారు. దీంతో కార్మికులే సొంత డబ్బులతో యూనిఫాంను కొనుగోలు చేస్తున్నారు. ఒక జత కొనుగోలు చేయాలంటే సుమారు రూ.2వేలకు పైగా ఖర్చు అవుతోందని కార్మికులు వాపోతున్నారు. గతంలో నుంచి వస్తున్న కొత్త యూనిఫామ్‌ ఇచ్చే సంప్రదాయాన్ని నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

కేటాయింపులు పెంచాలి...

ప్రస్తుతం కుట్టు కూలి ఖర్చు కూడా పెరిగిందని, ఇందుకు అనుగుణంగా కేటాయింపులు పెంచి ప్రతి కార్మికునికి యూనిఫాంను పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. కార్మికుల సంఖ్యకు అనుగుణంగా సంస్థకు వచ్చే రెండు, మూడు రోజుల ఆదాయాన్ని సమకూరుస్తే ఈ సమస్యను పరిష్కరించడానికి వెసులుబాటు కలుగుతుందని కార్మిక వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ప్రభుత్వం అందించాల్సిన యూనిఫాంను అందించకపోవడంతో గత నాలుగేళ్ల నుంచి కార్మికులపై సుమారు రూ.4.42 కోట్లు ఆర్థిక భారం పడిందని వారు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని