Crime news: అమాయకుల ప్రాణాలు తీస్తున్న సైకో కిల్లర్ ఖదీర్ అరెస్టు
వివరాలు తెలియజేస్తున్న నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్
నారాయణగూడ, న్యూస్టుడే: అకారణంగా అమాయకుల ప్రాణాలు తీస్తున్న ఉన్మాదిని హబీబ్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కేసు వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం, హుమ్నాబాద్ తాలుకా జగదల్ గ్రామానికి చెందిన మహ్మద్ ఖదీర్ తన 15వ ఏట ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు. బోరబండ సఫ్దార్నగర్లో నివాసం ఉంటూ అడ్డాకూలీగా, ఆటో డ్రైవర్గా పని పనిచేసేవాడు. ఇతనికి వివాహమై అయిదుగురు పిల్లలున్నా వారిని పట్టించుకోకుండా ఫుట్పాత్లపై కాలం గడిపేవాడు. 2017లో రెండు నేరాల్లో అరెస్టై విడుదలయ్యాక 2019 డిసెంబరు 30న నాంపల్లి పోలీసు ఠాణా పరిధిలో యాచకుడు ముబాకర్ అలీని దారుణంగా హతమార్చి పోలీసులకు చిక్కాడు. 16 నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించి 20121 ఏప్రిల్ 8న బెయిల్పై బయటకొచ్చినా తీరు మార్చుకోలేదు. 2021 సెప్టెంబరు 15న హబీబ్నగర్ పోలీసు ఠాణా పరిధిలోని ముర్గీ మార్కెట్లో ఫుట్పాత్పై నిద్రిస్తున్న ఓ బిచ్చగాడి జేబులోంచి డబ్బులు దొంగిలించే క్రమంలో బలంగా నెట్టివేయడంతో వెన్నెముక విరిగి మృతిచెందాడు. 2021 సెప్టెంబరు 31న రాత్రి మద్యం మత్తులో తబండ ఎక్స్ రోడ్లో ఫుట్పాత్పై నిద్రపోతున్న వ్యక్తిని అగ్గిపెట్టె కోసం నిద్ర లేపి, తర్వాత డబ్బులు డిమాండ్ చేశాడు. అతడు నిరాకరించడంతో అక్కడే ఉన్న సిమెంట్ దిమ్మెతో తలపై మోది హతమార్చి అతడి జేబులో ఉన్న రూ.150 నగదు, మద్యం సీసా తీసుకొని వెళ్లిపోయాడు. అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత నాంపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతానికి చేరుకొని ఆటో ట్రాలీలో నిద్రపోతున్న ఖాజా అనే వ్యక్తిని నిద్రలేపి, చోటివ్వమని అడిగి, రాయితో దాడి చేసి హత్య చేశాడు. అయితే, హత్యకు గురైనవారు అతడికి పరిచయం ఉన్నవాళ్లే కావడం గమనార్హం. అప్పటి నుంచి నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
ఇలా దొరికాడు.. నాంపల్లి బజార్ఘాట్లోని భారత్ టిఫిన్ సెంటర్లో తబండ కూడలి వద్ద నివాసం ఉండే సునీల్ ప్రభాకర్ హెల్పర్గా పని చేస్తాడు. ఎప్పటిలాగే సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు విధులకు వచ్చాడు. అక్కడే ఓ వ్యక్తి అపస్మారకస్థితిలో కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలికి వెళ్లిన హబీబ్నగర్ పోలీసులు అరెస్టు చేసి విచారించగా తాను చేసిన హత్యలను గురించి చెప్పాడు. బాల్యంలోనే చెడు వ్యసనాలకు బానిసైనట్లు, తండ్రి దారుణంగా హింసించేవాడని నిందితుడు చెప్పినట్లు జాయింట్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేసి కఠిన శిక్షపడేలా చూస్తామన్నారు. సమావేశంలో పశ్చిమ మండలం జాయింట్ కమిషనర్ ఎ.ఆర్.శ్రీనివాస్, ఆసీఫ్నగర్ ఏసీపీ శివమారుతి, హబీబ్నగర్ ఇన్స్పెక్టర్ నరేందర్ తదితరులు ఉన్నారు.
Advertisement