logo

ఉత్తుత్తి ఇంటర్వ్యూలు.. నియామకాలు

పంచాయతీరాజ్‌ శాఖలో ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసి రూ.1.29 కోట్లు కాజేసిన ముగ్గురు నిందితులను ఉత్తర మండలం

Updated : 05 Dec 2021 01:52 IST

ముగ్గురి అరెస్టు

వీరమణి, రాజ్‌కుమార్‌, పాండు

ఈనాడు,హైదరాబాద్‌, న్యూస్‌టుడే, రెజిమెంటల్‌బజార్‌: పంచాయతీరాజ్‌ శాఖలో ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసి రూ.1.29 కోట్లు కాజేసిన ముగ్గురు నిందితులను ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ అధికారులు శనివారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.8.85 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వరరావు తెలిపారు.

జూనియర్‌, రికార్డు అసిస్టెంట్లు... వరంగల్‌ జిల్లాకు చెందిన అరండకర్‌ రాజ్‌కుమార్‌ ములుగు జిల్లా కేంద్రంలో పంచాయతీరాజ్‌ శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. సులభంగా రూ.లక్షలు సంపాదించేందుకు ఉద్యోగాల పేరుతో మోసాలు చేద్దామని నిర్ణయించుకున్నాడు. తాండూరు, బడంగ్‌పేటలో ఉంటున్న అతడి అనుచరులు వీరమణి, పాండు ను రాజ్‌కుమార్‌ ఏడాది క్రితం సంప్రదించాడు. పంచాయతీ రాజ్‌ శాఖలో జూనియర్‌, రికార్డు అసిస్టెంట్ల ఉద్యోగాలతో పలువురిని మోసం చేయగా బాధితులు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు రాజ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేశారు.

ఎర్రమంజిల్‌ కార్యాలయంలో.. ఉద్యోగం నుంచి తొలగించడంతో రాజ్‌కుమార్‌ నిరుద్యోగులను మోసం చేసేందుకు మరింత పక్కాగా పథకం రచించాడు. బాధితులను నమ్మించేందుకు ఉత్తుత్తి ఇంటర్వ్యూలు, నియామక పత్రాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. వీరమణి, పాండు బాధితులతో మాట్లాడి రూ.లక్షలు వసూలు చేస్తుండగా.. రాజ్‌కుమార్‌ ఐదారుగురిని తీసుకుని ఎర్రమంజిల్‌లోని పంచాయతీరాజ్‌ ప్రధాన కార్యాలయానికి వచ్చేవాడు. సందర్శకులు కూర్చునే కుర్చీలో నకిలీ అధికారిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయించి నకిలీ నియామక పత్రాలు అందించేవాడు. వాటితో కార్యాలయాలకు వెళ్లగా నకిలీవని తేలడంతో మోసపోయిన వారిలో ఇద్దరు పంజాగుట్ట, మీర్‌పేట ఠాణాల్లో ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని