logo

వివిధ ఘటనల్లో అయిదుగురి ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా  రాయపోల్‌ మండలం ఎల్కల్‌లో ఆదివారం చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు..

Published : 06 Dec 2021 02:27 IST

మనోహరాబాద్‌, న్యూస్‌టుడే: సంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో ఆదివారం వివిధ కారణాలతో అయిదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు..

అప్పుల బాధతో రైతు...  

రాయపోల్‌ (దౌల్తాబాద్‌) న్యూస్‌టుడే: అప్పుల బాధతో రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా  రాయపోల్‌ మండలం ఎల్కల్‌లో ఆదివారం చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జాల భూమయ్య (55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం సాయంత్రం వరకు కొడుకు సురేందర్‌తో కలిసి పొలం పనుల్లో పాల్గొన్నారు. తర్వాత ఎడ్లకు నీరు తాపి వస్తానని చెప్పి వెళ్లి ఎంతకూ ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పొలం, గ్రామంలో వెతికినా కనిపించలేదు. ఆదివారం ఉదయం గ్రామం చుట్టుపక్కల చూడగా తాళ్లకుంట సమీపంలో చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


* దంపతుల మధ్య గొడవతో విసుగు చెందిన భర్త బావిలో దూకి ఆత్మహత్య చేసుకోగా విషయం ఆదివారం వెలుగు చూసింది. ఈ ఘటన మండల పరిధి చెట్లగౌరారంలో చోటు చేసుకుంది. మనోహరాబాద్‌ ఎస్‌ఐ రాజు గౌడ్‌ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మౌలానా కుమారుడు బాబర్‌ (30) ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. అతనికి తూప్రాన్‌కు చెందిన నూర్జహాన్‌ బేగంతో ఆరేళ్ల క్రితం వివాహం చేశారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉండగా బాబర్‌కు ఆశించిన స్థాయిలో ఆదాయం లేకపోవడంతో నూర్జహాన్‌ బేగం ఆరునెలల క్రితం భర్తను వదిలి పుట్టింటికి వెళ్లింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అతను ఈ నెల 2న ఇంటినుంచి వెళ్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకాడు. ఈత రాకపోవడంతో నీట మునిగి చనిపోయాడు. ఆదివారం ఉదయం మృతదేహాన్ని గమనించిన వ్యవసాయ పొలం యజమాని కృష్ణ గౌడ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బావి వద్దకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి బాబర్‌గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుని తండ్రి మౌలానా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తూప్రాన్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.


కుటుంబ కలహాలతో వివాహిత..

బషీరాబాద్‌, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... బషీరాబాద్‌ మండలం పర్వత్‌పల్లికి చెందిన పాషాతో గొట్టిగకుర్ధుకు చెందిన మహ్మద్‌ బిజానీ (26)కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. కుటుంబంలో గొడవల కారణంగా ఇటీవల ఆమె గొట్టిగకుర్ధులోని తల్లిగారింటికి వచ్చింది. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బిజానీ పురుగుల మందు సేవించి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు పేర్కొన్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


భార్య కాపురానికి రానంది.. భర్త..

నవాబుపేట, న్యూస్‌టుడే: నవాబుపేట మండలం చించల్‌పేట గ్రామానికి చెందిన సీహెచ్‌ మహేష్‌ (32) మోమిన్‌పేట మండలం వెల్‌చాల్‌ గ్రామానికి చెందిన ఉమామహేశ్వరితో ఎనిమిదేళ్ల కిత్రం  వివాహమైంది. కొడుకు, కూతుర్లున్నారు. భార్యా భర్తల మధ్య తరచూ  గొడవలు జరగడంతో భార్య సంవత్సరం క్రితమే పుట్టింటికి వెళ్లిపోయింది. నెల క్రితం ఆమెను తీసుకు రావడానికి అత్తారింటికి వెళ్లినా ఆమె నిరాకరింది. దీంతో మనస్థాపానికి గురై తాగుడుకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చి, పక్కగదిలోకి వెళ్లాడు. ‘భోజనం చేయవా’ అంటూ తండ్రి పిలిచాడు. సమాధానం లేకపోవడంతో గదిలోకి వెళ్లి  గమనించగా చీరతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. తండ్రితో పాటు, కుటుంబ సభ్యులు గమనించగా అప్పటికే మృతిచెందాడు. విషయాన్ని పోలీసులకు తెలిపారు. మృతుడి తండ్రి నర్సిములు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశం తెలిపారు.  


మతిస్థిమితం లేక... మద్యానికి బానిసై

మద్యానికి బానిసై ఉరేసుకొని మృతిచెందాడో వ్యక్తి... పోలీసులు, కుటుంబీకుల వివరాల ప్రకానం మహబూబ్‌నగర్‌ జిల్లా, బాలనగర్‌ మండలం, చిన్నరేవెల్లి గ్రామానికి చెందిన వై..వెంకటయ్య, (40) భార్య యాదమ్మలకు ముగ్గురు సంతానం. పెద్ద అమ్మాయి వివాహం చేశారు. పిల్లలు సంధ]్య, శ్రీరామ్‌లతో కలిసి నాలుగు నెలల క్రితం నవాబుపేట మండలం ముభారక్‌పూర్‌ గ్రామ సమీపంలో అదే గ్రామానికి చెందిన  విష్ణువర్థన్‌రెడ్డి కోళ్లఫాంలో పనికి కుదిరారు. వెంకటయ్యకు గతంలో రోడ్డు ప్రమాదంలో తలకు గాయమెంది. దీంతో అప్పుడప్పుడు మతిస్థిమితం లేకుండా వ్యవహరించేవాడు. మద్యానికి అలవాటు పడ్డాడు. భార్య ఎంత చెప్పినా వినిపించుకునేవాడు కాదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం భార్య నిద్రలేచి చూసే సరికి ఇంట్లో లేడు. గమనించగా పక్క గదిలో ఉరి వేసుకుని కనిపించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని