ఐటీ కారిడార్ చుట్టూ ఆర్టీసీ వలయం
ఈనాడు - హైదరాబాద్: ఐటీ కారిడార్ చుట్టూ ఆర్టీసీ సిటీ బస్సులు తిప్పడానికి గ్రేటర్ హైదరాబాద్ జోన్ రంగం సిద్ధం చేస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి ఆర్థిక మండలిలోని పలు ఐటీ సంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులకు సౌకర్యవంతమైన ప్రజారవాణాను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మెహిదీపట్నం, మియాపూర్, బీహెచ్ఈఎల్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, రాణిగంజ్, బర్కత్పురా, ముషీరాబాద్, కూకట్పల్లి డిపోల నుంచి నలువైపులా బస్సులను తిప్పి ఐటీ కారిడార్లో ప్రజారవాణాను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది.
మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి..
నగరంలో ఎక్కడున్నా.. ఐటీ కారిడార్కు అనుసంధానమయ్యేలా మూడు రకాల ప్రజారవాణా ప్రస్తుతం నగరంలో అందుబాటులో ఉంది. ఇలా నగరం నలువైపుల నుంచి హైటెక్సిటీ ఎంఎంటీఎస్, దుర్గం చెరువు, సైబర్టవర్స్, రాయదుర్గం మెట్రోస్టేషన్ల నుంచి ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల ద్వారా ఐటీ కార్యాలయాలకు తీసుకెళ్లడమే లక్ష్యమని గ్రేటర్జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇలా ఉదయం 8 నుంచి 10 వరకు. సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు అరగంటకో ఎంఎంటీఎస్ రాకపోకలు సాగిస్తున్న వేళ తదనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయడానికి డిపోల వారీ బస్సులను సమకూర్చుతారు. ఇలాగే మెట్రో స్టేషన్లను లక్ష్యంగా పెట్టుకుని కూడా బస్సులను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
వజ్ర బస్సులను కూడా..
కరోనా సమయంలో ఖాళీగా ఉండి కొన్ని బస్సులు మూలకు చేరగా 30 వజ్ర బస్సుల వరకూ తక్కువ దూరంలో తిరిగేందుకు అనువుగా ఉన్నాయి. కండక్టర్ అవసరం లేని ఈ బస్సులను ఐటీ సంస్థలకు కేటాయించేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. ఐటీ కారిడార్కు దగ్గర్లోని మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి ఉద్యోగులను కార్యాలయాలకు చేర్చడం.. సాయంత్రం తిరిగి తీసుకురావడం కోసం వీటిని వినియోగించాలని ఆర్టీసీ చూస్తోంది. వీటికి తోడు ఆర్టీసీ సిటీ బస్సులను కూడా అద్దెకు తిప్పేందుకు సిద్ధమయ్యారు. ఐటీ కారిడార్కు నలువైపులా బస్సులు అందుబాటులో ఉంచాలనేది మరో ఆలోచన. అవసరమైతే అద్దె బస్సులను తీసుకుని నడిపేందుకూ యోచిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.