logo

డ్రగ్స్‌ పంచుకుంటుండగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని.. మరో ఇద్దరి అరెస్టు

ఆ ముగ్గురు ఆన్‌లైన్‌లో స్నేహితులయ్యారు. తరచూ పబ్‌లో కలుసుకునే వారు.. మత్తు మందుకు అలవాటు పడ్డారు. గోవాలో కొనుగోలు చేసిన డ్రగ్స్‌ పంచుకుంటున్న వేళ రాచకొండ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ సీఐ ఎన్‌.చంద్రబాబు, నేర విభాగం సీఐ కె.జంగయ్య తెలిపిన వివరాల ప్రకారం

Updated : 16 Dec 2021 09:47 IST

జమీర్‌ సిద్ధిఖ్‌, పులి రమ్య, అఖిల్‌

ఘట్‌కేసర్‌, న్యూస్‌టుడే: ఆ ముగ్గురు ఆన్‌లైన్‌లో స్నేహితులయ్యారు. తరచూ పబ్‌లో కలుసుకునే వారు.. మత్తు మందుకు అలవాటు పడ్డారు. గోవాలో కొనుగోలు చేసిన డ్రగ్స్‌ పంచుకుంటున్న వేళ రాచకొండ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ సీఐ ఎన్‌.చంద్రబాబు, నేర విభాగం సీఐ కె.జంగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌ ఠాణా పరిధి ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో మంగళవారం సాయంత్రం కారులో మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం అందింది. ఎస్సైలు సుధాకర్‌, శైలజ తమ సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. వారిలో మెహిదీపట్నం విజయ్‌నగర్‌కాలనీకి చెందిన హార్మోని అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న మహమ్మద్‌ జమీర్‌ సిద్ధిఖ్‌(28), హఫీజ్‌పేట్‌ గోపాల్‌నగర్‌లోని శ్రీ రెసిడెన్సీలో ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పులి రమ్య(32), అల్మాస్‌గూడ శేషాద్రినగర్‌లో నివాసముంటున్న కౌకుంట్ల అఖిల్‌(31)గా గుర్తించారు.  వారి వద్ద  నుంచి వివిధ రకాల 9.4 గ్రాముల డ్రగ్స్‌తో పాటు గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నట్లు సీఐలు పేర్కొన్నారు.  ఈ ముగ్గురు ‘క్లబ్‌ హౌస్‌’ అనే ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా పరిచయమయ్యారు. యాప్‌లో డ్రగ్స్‌ గురించి చర్చించేవారు. గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో తరచూ కలుసుకునే వారు. కౌకుంట్ల అఖిల్‌ గోవా వెళ్లి డ్రగ్స్‌ కొనుగోలు చేసి వచ్చేవాడు. దాన్ని మిగతా ఇద్దరికి ఇచ్చేవాడు. డిసెంబరు 31 రాత్రి వేడుకలు చేసుకునేందుకు జమీర్‌ సిద్ధిఖ్‌, పులి రమ్య ఈ నెల 9న గోవాకు వెళ్లి డ్రగ్స్‌ కొన్నారు. మంగళవారం అఖిల్‌కు డ్రగ్స్‌ ఇస్తున్న సమయంలో పోలీసులకు చిక్కారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని