logo

Cyber Crime: సందేశం రాకుండా రూ.2.2 కోట్లు స్వాహా

చరవాణులు, ల్యాప్‌టాప్‌ డెస్క్‌టాప్‌లను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరస్థులు సికింద్రాబాద్‌లోని వ్యాపారి లోక్‌జిత్‌ సాయినాథ్‌ వ్యాలెట్ల నుంచి రూ.2.20 కోట్ల

Updated : 18 Dec 2021 09:53 IST

క్రిప్టోకరెన్సీ వ్యాలెట్లలో డిజిటల్‌ కరెన్సీ బదిలీ

ఈనాడు,హైదరాబాద్‌, న్యూస్‌టుడే, నారాయణగూడ: చరవాణులు, ల్యాప్‌టాప్‌ డెస్క్‌టాప్‌లను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరస్థులు సికింద్రాబాద్‌లోని వ్యాపారి లోక్‌జిత్‌ సాయినాథ్‌ వ్యాలెట్ల నుంచి రూ.2.20 కోట్ల డిజిటల్‌ కరెన్సీని బదిలీ చేసుకున్నారు. బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం లోక్‌జిత్‌ సాయినాథ్‌ ఆరేడేళ్ల నుంచి క్రిప్టోకరెన్సీ కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తున్నాడు. వాటికి సంబంధించిన యాప్‌లను కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌పై ఉంచాడు. నిత్యం లావాదేవీలు నిర్వహిస్తుండగా.. ఈ నెల 3న అతని వ్యాలెట్లలోని రూ.2.20 కోట్ల డిజిటల్‌ కరెన్సీని మార్చుకునేందుకు యత్నించగా వీలు కాలేదు. లావాదేవీలు నిర్వహించేందుకు వీల్లేకపోయినా... తన వ్యాలెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నిర్వహిస్తున్నారని గుర్తించాడు. రెండు రోజుల్లోనే రూ.2.20 కోట్ల డిజిటల్‌ కరెన్సీని 3.5 లక్షల అమెరికన్‌ డాలర్లుగా మార్చి బదిలీ చేసుకున్నట్లు తెలుసుకున్నాడు. వ్యాలెట్లను రూపకల్పన చేసిన కంపెనీల సహాయ కేంద్రాలను సంప్రదించినా ఉపయోగం లేకపోవడంతో చివరకు ఫిర్యాదు చేశాడు.

సందేశాలా.. యాప్‌లా..?

డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరస్థులను వాటిని హ్యాకింగ్‌ చేసేందుకు సందేశాలు పంపించారా?.. యాప్‌ల ద్వారా వాటిని అధీనంలోకి తీసుకున్నారా? అన్న అంశాలను పరిశీలిస్తున్నామని సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు. లోక్‌జిత్‌ సాయినాథ్‌ ల్యాప్‌టాప్‌ను పరిశీలిస్తే రిమోట్‌ కంట్రోల్‌ వంటి సాంకేతికతతో డిజిటల్‌ కరెన్సీని బదిలీ చేసుకున్నారా?.. ఐపీ చిరునామాలను డూప్లికేట్‌ చేశారా?.. అన్న అంశాలపై స్పష్టత వస్తుందన్నారు. రెండు నెలల క్రితం ఓ వ్యక్తి చరవాణిని హ్యాక్‌ చేసి అతని వ్యాలెట్‌లోని రూ.25 లక్షల విలువైన బిట్‌కాయిన్‌ క్రిప్టోకరెన్సీని బదిలీ చేసుకున్నారని చెప్పారు. డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌, చరవాణి హ్యాకింగ్‌ చేయడం కొత్త తరహా మోసమని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని