logo

ఊరెళ్తున్నారా..కరోనా తీసుకెళ్లొద్దు!

సంక్రాంతి అంటే చాలు.. భాగ్యనగరం పల్లెకు వరుస కడుతుంది. రెండేళ్లుగా కరోనాతో సంబరాలకు దూరంగా ఉంటున్న చాలామంది.. ఈ ఏడాది ఊరిలో జరుపుకోవాలని పల్లె బాట పడుతున్నారు. 10-15 లక్షల మంది ఈ వారం రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాలకు పయనమవుతున్నారు. ఇప్పటికే కొందరు సొంతూళ్లకు పయనమవ్వగా.

Updated : 13 Jan 2022 07:51 IST

జాగ్రత్తలు తీసుకుంటే మేలంటున్న వైద్యులు
 ఈనాడు, హైదరాబాద్‌

సంక్రాంతి అంటే చాలు.. భాగ్యనగరం పల్లెకు వరుస కడుతుంది. రెండేళ్లుగా కరోనాతో సంబరాలకు దూరంగా ఉంటున్న చాలామంది.. ఈ ఏడాది ఊరిలో జరుపుకోవాలని పల్లె బాట పడుతున్నారు. 10-15 లక్షల మంది ఈ వారం రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాలకు పయనమవుతున్నారు. ఇప్పటికే కొందరు సొంతూళ్లకు పయనమవ్వగా.. ఇంకా కొంతమంది వచ్చే రెండు రోజుల్లో హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఒమిక్రాన్‌ ముప్పు పొంచి ఉన్నందున ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నాసరే.. మన నుంచి మరొకరికి వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. పెద్దవారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇతర జిల్లాలతో పోల్చితే భాగ్యనగరంలో రోజుకు వేయికి తక్కువ లేకుండా కరోనా కేసులు బయట పడుతున్నాయి. ఇందులో అధికశాతం ఒమిక్రాన్‌ వేరియంట్‌ బాధితులే ఉంటున్నారు. సాధారణ డెల్టాతో పోల్చితే దీని వ్యాప్తి అయిదు రెట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఒకరి నుంచి ఇంకొకరికి వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా చాలామందిలో వైరస్‌ సోకినా సరే... ఎలాంటి లక్షణాలు ఉండట్లేదు. వీరికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. ఇలాంటి వారి ద్వారా ఊళ్లో ఉన్న పెద్ద వారికి సోకితే.. వారి ఆరోగ్యానికి ముప్పు ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఊరెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకొంటే... సరదాగా అందరితో పండుగను జరుపుకొని తిరిగి ఆనందంగా పట్టణానికి చేరుకోవచ్చు.

ప్రగతిభవన్‌ వద్ద బందోబస్తులో ఉన్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునేందుకు చేతులకు గ్లౌజులు ధరించారు.

24 గంటల్లో 1682 మందికి నిర్ధారణ

గ్రేటర్‌ పరిధిలోని మూడు జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. రెండు రోజులపాటు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా...తాజాగా బుధవారం 1682 కేసులు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇందులో జీహెచ్‌ంఎసీ పరిధిలో 1275, రంగారెడ్డి జిల్లాలో 173, మేడ్చల్‌-మల్కాజిగిరిలో 234 కేసులు నమోదయ్యాయి. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌ ధరించాలని, గుంపులకు దూరంగా ఉండటంతోపాటు చేతి శుభ్రత తప్పక పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.


నిపుణుల సూచనలు ఇవీ..

* ఊరెళ్లే ముందు తప్పనిసరిగా అందరూ టీకా రెండు డోసులు తీసుకోవాలి. కుటుంబంలో 15-18 ఏళ్ల వారుంటే తొలి డోసు అయినా వారికి ఇప్పించాలి.


* జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు లాంటివి ఉంటే వెంటనే కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలి. అందులో నెగెటివ్‌ వస్తేనే ఊరు వెళ్లాలి.


* బస్సులు, రైళ్లలో వెళ్లేటప్పుడు ఎన్‌-95 మాస్క్‌ ధరించాలి. లేదంటే క్లాత్‌మాస్క్‌పై.. సర్జికల్‌ మాస్క్‌ పెట్టుకోవాలి.


* కోడి పందేలు, సాంస్కృతిక కార్యక్రమాల వద్ద వందల సంఖ్యలో గుంపులుగా ఉంటారు. ఇలాంటి రద్దీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం మేలు.


* చుట్టాలు, బంధువుల ఇళ్లకు వెళ్లడం, శుభ కార్యాలయాల్లో అధిక సంఖ్యలో పాల్గొనటం తగ్గించుకోవాలి. ఒకవేళ వారిళ్లకు వెళ్లినా సామాజిక దూరం పాటించాలి.


ఉద్ధృతి లేకున్నా ఉదాసీనత వద్దు

గాంధీలో 70, టిమ్స్‌లో 42 మందికి చికిత్స

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: రాజధానిలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గతంలో డెల్టా వైరస్‌ సోకినప్పుడు ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపించడంతో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఒమిక్రాన్‌ వైరస్‌ తీవ్రత కాస్త తక్కువగా ఉండటంతో బాధితులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పది రోజులుగా పెద్దఎత్తున కేసులు వస్తున్నా కూడా గాంధీ, టిమ్స్‌ ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య తక్కువగానే ఉంటోంది. గాంధీలో కరోనా రోగుల కోసం 300 పడకలను కేటాయిస్తే బుధవారం వరకు 70 మంది చేరి చికిత్స పొందుతున్నారు. టిమ్స్‌లోనూ పరిస్థితి ఇలానే ఉంది. ఇక్కడ 42 కరోనా కేసులున్నాయి. నమోదవుతున్న కేసుల ప్రకారం చూస్తే ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య తక్కువగానే ఉన్నా ఉదాసీనంగా ఉండొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


సాధారణ లక్షణాలే ఉంటున్నాయి

రోజూ పది నుంచి పదిహేను మంది వరకు చేరుతున్నారు. సాధారణ వైద్యంతోనే వీరికి నయం అవుతోంది. మధుమేహంతోపాటు ఇతరత్రా వ్యాధులున్న వారు మాత్రం నిర్లక్ష్యం చేయకండా వైద్యులు పర్యవేక్షణలో ఉండటం ఉత్తమం.

- డాక్టర్‌ రామరాజు, ఆర్‌ఎంవో, టిమ్స్‌


భయపడాల్సిన అవసరం లేదు

కరోనా రోగుల కోసం మొన్నటి వరకు 200 పడకలుండేవి. ఇప్పుడే ఈ సంఖ్య 300కు చేశాం. ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం 1100 పడకల్లో ఉన్న సాధారణ రోగుల్లో అవసరమైన వారికి త్వరితగతిన శస్త్రచికిత్సలు చేసి అవసరమైతే వాటిని కూడా కేటాయించేందుకు సిద్ధంగా ఉంచాలని అనుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే గాంధీలో చేరే బాధితుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. ఎంతమంది వచ్చినా కూడా వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నాం.

- డా.ప్రభాకరరెడ్డి, నోడల్‌ అధికారి గాంధీ ఆసుపత్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని