logo

TS News: విద్యుత్తు రీకనెక్షన్‌ తంటా.. రూ.75 చెల్లించేందుకు కార్యాలయానికి వెళ్లాల్సిందే

సికింద్రాబాద్‌కు చెందిన విద్యుత్తు వినియోగదారుడు ఒకరు సకాలంలో బిల్లు కట్టకపోవడంతో లైన్‌మైన్‌ వచ్చి కరెంట్‌ కనెక్షన్‌ తొలగించారు. అప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లు చెల్లించి రీకనెన్షన్‌ ఇమ్మని కోరితే.. కార్యాలయానికి వచ్చి రూ.75 ఫీజు చెల్లిస్తేనే కనెక్షన్‌ ఇస్తామన్నారు.

Updated : 20 Jan 2022 08:05 IST
ఆన్‌లైన్‌లో చెల్లింపు సదుపాయం లేక ఇబ్బందులు
ఈనాడు, హైదరాబాద్‌

సికింద్రాబాద్‌కు చెందిన విద్యుత్తు వినియోగదారుడు ఒకరు సకాలంలో బిల్లు కట్టకపోవడంతో లైన్‌మైన్‌ వచ్చి కరెంట్‌ కనెక్షన్‌ తొలగించారు. అప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లు చెల్లించి రీకనెన్షన్‌ ఇమ్మని కోరితే.. కార్యాలయానికి వచ్చి రూ.75 ఫీజు చెల్లిస్తేనే కనెక్షన్‌ ఇస్తామన్నారు. ఇంట్లో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వాళ్లు ఉన్నారు.. కార్యాలయం వరకు రాలేని పరిస్థితి ఉందని వివరించినా లైన్‌మెన్‌ ససేమిరా అన్నారు. రీకనెక్షన్‌ ఫీజును ఆన్‌లైన్‌లో కడదామని ప్రయత్నించగా.. ఇప్పటికీ ఆ సదుపాయం లేదని విద్యుత్తు అధికారులు తెలిపారు. ప్రతి నెలా లక్షల మంది వినియోగదారులు రీకనెక్షన్‌ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించే వెలుసుబాటు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ కొత్త విద్యుత్తు కనెక్ష్షన్‌ మొదలు మీటర్‌ టెస్టింగ్‌ వరకు చాలా సేవలు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం కల్పించినప్పటికీ.. ఇప్పటికీ కొన్ని సేవలు ఆన్‌లైన్‌కు దూరంగా ఉన్నాయి. మరికొన్ని సేవలు ఆన్‌లైన్‌ చేసినా.. తరచూ సమస్యలతో వినియోగదారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా స్పందన ఉండటం లేదని వినియోగదారులు వాపోతున్నారు.

చిన్న మొత్తాలే.. పెద్ద కష్టాలు

సకాలంలో బిల్లులు చెల్లించక పోయినా.. ఇతరత్రా కారణాలతో ప్రతినెలా నగరంలో పెద్ద సంఖ్యలో సర్వీసు కనెన్షన్‌లను తొలగిస్తుంటారు. బకాయి పడిన బిల్లుతో పాటు అదనంగా రీకనెన్షన్‌ ఫీజు చెల్లిస్తే తిరిగి కనెన్షన్‌ను ఇస్తారు. ఆన్‌లైన్‌ చేయక ముందు కార్యాలయానికి వెళ్లి చెల్లించేవారు. కొందరేమో లైన్‌మెన్‌, ఆర్టిజన్‌లకు కట్టేయమనేవారు. ప్రస్తుతం 77 శాతం బిల్లులు ఆన్‌లైన్‌లో చేస్తున్నారు. రూ.75 రీకనెన్షన్‌ ఫీజు చెల్లింపు మాత్రం ఇప్పటికీ ఆన్‌లైన్‌ చేయలేదు. అది ఇప్పుడు పెద్ద సమస్యగా ఉంది. సిబ్బంది జేబుల పాలవుతోంది. చెక్‌ పెట్టాలంటే ఆన్‌లైన్‌ చెల్లింపునకు అవకాశం కల్పించాలి. అదనపు లోడు రికార్డైన వినియోగదారులకు డెవలప్‌మెంట్‌ ఛార్జీలు వేస్తున్నారు. ఆన్‌లైన్‌లో చెల్లిద్దామంటే టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ వెబ్‌సైట్‌లో రావడం లేదు. దీన్ని పరిష్కరించాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని