logo

హుస్సేన్‌సాగర్‌పై వేలాడే వంతెన

రష్యా రాజధాని మాస్కోలోని నదీ తీరంలో నిర్మించిన తేలియాడే వంతెన హుస్సేన్‌ సాగర్‌ చెంతనా రాబోతోంది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్‌ శుక్రవారం ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు....

Updated : 22 Jan 2022 15:00 IST

మాస్కో తరహాలో నిర్మించే యోచన

ట్విటర్‌లో పంచుకున్న అర్వింద్‌కుమార్‌

మాస్కోలోని మోస్క్వా నదిపై నిర్మించిన వేలాడే వంతెన(ఇలాంటిదే హుస్సేన్‌ సాగర్‌పై రానుంది)

ఈనాడు, హైదరాబాద్‌: రష్యా రాజధాని మాస్కోలోని నదీ తీరంలో నిర్మించిన తేలియాడే వంతెన హుస్సేన్‌ సాగర్‌ చెంతనా రాబోతోంది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్‌ శుక్రవారం ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. ఈ ఏడాది ఆఖరు నాటికి నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌ వద్ద ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. మాస్కోలోని జర్యాడే పార్క్‌లో మోస్క్వా నదిపై తేలియాడే వంతెన ఉంది. అక్కడ ఉత్తమ పర్యాటక ప్రాంతాల్లో అదొకటిగా నిలుస్తోంది. నది లోపలకి యూ ఆకారంలో దాదాపు 70 మీటర్ల పొడవుతో నిర్మించారు. వంతెన కింద 13 మీటర్ల దూరం నుంచి మోస్వ్యా నది ప్రవహిస్తుంది. ఈ వంతెనపై ఉంటే నదిలో తేలుతున్న అనుభూతి కలుగుతుంది. నది లోపల ఎలాంటి స్తంభాలు లేకుండా రోప్‌వే ద్వారా దీనిని తీర్చిదిద్దిన విధానం చూస్తే... ఇంజినీరింగ్‌ అద్భుతం కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది. మన వద్ద కూడా దుర్గం చెరువుపై ఇలాంటి సాంకేతికతను ఉపయోగించి వంతెన నిర్మించిన విషయం తెలిసిందే. ఇంతకంటే అత్యాధునిక సాంకేతికతతో మోస్క్వా నదిపై తేలాడే వంతెనను అందుబాటులోకి తెచ్చారు. దీని నిర్మాణంలో పారదర్శకమైన గాజును వినియోగించారు. ఫలితంగా వంతెనపై నిల్చొని కిందకు చూస్తే... నది అలలు, అందాలు స్పష్టంగా కనిపిస్తాయి. వంతెన డెక్‌ మొత్తం పొడవు 244 మీటర్లు. ఒకేసారి వంతెనపై 2400 మంది వరకు నిల్చొని నది అందాలతో పాటు జుర్యాడే పార్కు, రెడ్‌ స్క్వేర్‌ కళా చిత్రాలను తనివి తీరా చూడవచ్చు. నెక్లెస్‌ రోడ్డు వద్ద హుస్సేన్‌ సాగర్‌పై ఇలాంటి వంతెను వస్తే... హైదరాబాద్‌ పర్యాటక ముఖ చిత్రమే మారిపోనుంది. ఇప్పటికే ట్యాంక్‌ బండ్‌, నెక్లెస్‌ రోడ్డును ఏటా లక్షలాది మంది వీక్షిస్తుంటారు. త్వరలో ట్యాంక్‌బండ్‌ వద్ద నైట్‌ బజార్‌ రానుంది. ఈ తేలియాడే వంతెనతో సాగర్‌ అందాలు ఇనుమడించనున్నాయి. గతంలో ట్యాంక్‌బండ్‌పై లండన్‌ ఐ ఏర్పాటుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు చేసినా ప్రాజెక్టు ముందుకు కదలలేదు. అదే తరహాలో మరో ప్రాజెక్టు రూపకల్పనకు అడుగులు పడుతుండటంతో ఆసక్తి నెలకొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని