logo

అప్రమత్తతే రక్ష.. ఆదమరిస్తే శిక్ష

రోనా కేసులు పెరుగుతున్న వేళ.. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని.. అందులోనూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీరు వైరస్‌ బారిన పడితే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లేనని చెబుతున్నారు. కొద్ది రోజులుగా గాంధీ ఆస్పత్రి వైద్యులు చేసిన పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి వారు వైరస్‌ సోకినా మొదట్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రోజుల్లోనే ఆక్సిజన్‌.. తరువాత వెంటిలేటర్‌ మీదకు తరలించాల్సి వస్తోందని చెబుతున్నారు.

Updated : 25 Jan 2022 06:25 IST

దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ముప్పు అధికం

ఒమిక్రాన్‌ ఏమి చేయదనే భావన సరికాదు

గాంధీ వైద్యుల పరిశీలనలో వెల్లడి

కరోనా.. కర్ఫ్యూ!

గ్రేటర్‌లో గడిచిన 24 గంటల్లో 1,439 మంది కరోనా బారిన పడ్డారు.

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, ఈనాడు, హైదరాబాద్‌


నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రిలో పరీక్షలకు బారులు తీరిన జనం

కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని.. అందులోనూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీరు వైరస్‌ బారిన పడితే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లేనని చెబుతున్నారు. కొద్ది రోజులుగా గాంధీ ఆస్పత్రి వైద్యులు చేసిన పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి వారు వైరస్‌ సోకినా మొదట్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రోజుల్లోనే ఆక్సిజన్‌.. తరువాత వెంటిలేటర్‌ మీదకు తరలించాల్సి వస్తోందని చెబుతున్నారు.

ఆస్పత్రుల్లో పెరుగుతున్న చేరికలు

మొదటి రెండు దశల్లో కరోనా విజృంభణ సమయంలో గ్రేటర్‌లో వైరస్‌ బారినపడిన అనేక మంది ఊపిరితిత్తులు పూర్తి స్థాయిలో పని చేయక రక్తంలో ఆక్సిజన్‌ శాతం పడిపోయింది. వెంటిలేటర్‌ మీద ఉంచి వైద్యం చేసినా చాలా మంది ప్రాణాలు దక్కలేదు. మూడో దశలో ఒమిక్రాన్‌ కేసులే 90 శాతం ఉంటున్నాయి. ఒమిక్రాన్‌ బారిన పడినవారు వారంలోనే కోలుకుంటుండటంతో ముందు జాగ్రత్తలపై చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కనీసం మాస్కు లేకుండా బయట తిరుగుతున్నారు. మొదట్లో ఈ వైరస్‌ బారినపడి ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య తక్కువగా ఉన్నా, వారం నుంచి ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. గాంధీ, టిమ్స్‌ ఆస్పత్రిలో 250 మంది వైరస్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో దాదాపు వెయ్యిమంది చికిత్స పొందుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం గాంధీలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 167. పక్షం రోజులుగా చేరినవారిలో 78 మంది అప్పటికే వివిధ రోగాలతో బాధపడుతున్నారు. వీరిలో 74 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని గాంధీ నోడల్‌ అధికారి డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. వీరిలో చాలా మందికి ఆక్సిజన్‌ అందిస్తున్నారు. ఏ క్షణంలోనైనా వెంటిలేటర్‌ మీదకు పంపించాల్సి వస్తుందని చెబుతున్నారు. నెల నుంచి 400 మంది కరోనా చికిత్స కోసం గాంధీలో చేరారు. వివిధ రోగాలతో బాధపడేవారు వైరస్‌ బారినపడితే మాత్రం అది డెల్టా లేదా ఒమిక్రానైనా.. ఆరోగ్యం విషమిస్తోందని ఇక్కడి వైద్యుల పరిశీలనలో తేలింది. ఈ తరహా కేసులు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.


సోమవారం నిర్మానుష్యంగా ఎన్టీఆర్‌ మార్గ్‌

ఫోను కొట్టు.. సంచార రైతు బజారు వచ్చేట్టు

ఒమిక్రాన్‌ వేరియంట్‌ అందరినీ కలవర పెడుతున్న వేళ.. సంచార రైతుబజార్ల సంఖ్యను పెంచడానికి వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ రంగం సిద్ధం చేసింది. కాలనీలకు నేరుగా కూరగాయలను తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేస్తోంది. దగ్గర్లోని రైతుబజార్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌ను సంప్రదిస్తే.. కాలనీలకు, గేటెడ్‌ కమ్యూనిటీలకు సంచార వాహనాల ద్వారా కూరగాయలు తీసుకు వస్తారని వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ పేర్కొంది. నగరలోని 11 రైతుబజార్ల పరిధిలో ఈ సేవలను వినియోగించుకోవాలని కోరింది.


వారంలో కోలుకుంటామన్న భావనే వద్దు

- డాక్టర్‌ రాజారావు, సూపరింటెండెంట్‌, గాంధీ ఆస్పత్రి

ఒమిక్రాన్‌ బారినపడినా వారంలో బాగవుతామన్న ఉద్దేశంతో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది సరికాదు. ఆదివారం 65 మంది వస్తే 25 మందికి ఆక్సిజన్‌ అవసరం పడలేదు. చికిత్స అందించి ఇంటికి పంపించాం. మిగిలినవారు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. అందుకే అందరూ మాస్కు ధరించడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధులున్న వారు వైరస్‌ బారినపడితే వైద్యుల పర్యవేక్షణలో ఉంటేనే మేలు.


అశ్రద్ధ చేస్తే రీఇన్‌ఫెక్షన్‌కు అవకాశాలు ఎక్కువ

- డాక్టర్‌ బి.సుజీత్‌కుమార్‌, జనరల్‌ సర్జన్‌

కరోనా సోకి తగ్గాక అశ్రద్ధ కూడదు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. తిరిగి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కరోనా సోకిన వ్యక్తులు 10-14 రోజులు విశ్రాంతి తీసుకోవాలి. రీఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మాస్కు లేకుండా బయటికి రావొద్ధు బయట సమూహాల్లోకి వెళ్లకూడదు. వ్యాక్సిన్‌ రెండు డోసుల గడువు పూర్తయిన వ్యక్తులు.. బూస్టర్‌ డోసు వేసుకోవడం ఉత్తమం. రీఇన్‌ఫెక్షన్‌కు గురైతే సొంత వైద్యం వద్ధు. అంతకుముందు పారాసెట్మాల్‌ వేసుకుంటే తగ్గిపోయింది కదా.. అనుకుని సొంతంగా ముందులు వేసుకోరాదు. వైద్యుల పర్యవేక్షణలోనే ఔషధాలు వాడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని