logo

Hyd News: జిరాక్స్‌కాపీ చాలు.. కొట్టేస్తారు రూ.కోట్ల స్థలాలు!

‘‘మార్కెట్‌లో రూ.కోటి పలికే స్థలం. డబ్బు అత్యవసరమై రూ.40-50 లక్షలకే అమ్ముతున్నాడు. యజమాని విదేశాలకు వెళ్లిపోయేలోగానే సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే మంచిద’ంటూ ఆశ కల్పించే ఏజెంట్లు/దళారుల మాట నమ్మి

Updated : 22 May 2022 10:33 IST

శివారు ప్రాంతాల్లో అక్రమార్కుల భూదందా
పదులకొద్దీ నకిలీ పత్రాలు రూపొందించే ముఠాలు

‘‘మార్కెట్‌లో రూ.కోటి పలికే స్థలం. డబ్బు అత్యవసరమై రూ.40-50 లక్షలకే అమ్ముతున్నాడు. యజమాని విదేశాలకు వెళ్లిపోయేలోగానే సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే మంచిద’ంటూ ఆశ కల్పించే ఏజెంట్లు/దళారుల మాట నమ్మి సొమ్ము చేతికిచ్చారో.. నట్టేట మునిగినట్టే. నగరం, శివారు ప్రాంతాల్లోని ఖరీదైన స్థలాలకు నకిలీ పత్రాలు సృష్టించి తక్కువ ధరకు విక్రయిస్తూ కొన్ని ముఠాలు మోసాలకు పాల్పడుతున్నాయి. రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు రెండు నెలల వ్యవధిలోనే నాలుగు ముఠాలను అరెస్ట్‌ చేశారు. నిందితుల వద్ద లభించిన ఆధారాలను గుర్తించి ఉలికిపాటుకు గురయ్యారు. కీసర, మల్కాజిగిరి, కాప్రా, అల్వాల్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, హయత్‌నగర్‌, చందానగర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, షేక్‌పేట్‌ తదితర ప్రాంతాల్లోని విలువైన స్థలాలకు సంబంధించిన నకిలీ పత్రాలు వీరి వద్ద లభించడమే అసలు కారణం.  

శివార్లపైనే గురి ఎందుకంటే..  కొందరు స్థిరాస్తి వ్యాపారులు, దళారులు, నిర్మాణ రంగంలో పనిచేసిన ఉద్యోగులు, డాక్యుమెంట్‌ రైటర్లు, రిజిస్ట్రార్‌ శాఖ కార్యాలయ సిబ్బంది ముఠాలుగా మారి దందా నడిపిస్తున్నారు. పోలీసుల రికార్డుల ప్రకారం 10-15 ముఠాలు నకిలీ పత్రాలు సృష్టించి యథేచ్ఛగా స్థలాలను విక్రయిస్తూ రూ.వందల కోట్లు కాజేస్తున్నట్లు అంచనా. కీసర మండలం నాగారం వద్ద రూ.10కోట్ల విలువైన స్థలాన్ని సొంతం చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు రూ.లక్ష ఖర్చు చేసి నకిలీపత్రాలు రూపొందించాడు. పదేళ్ల క్రితం స్థిరాస్తి దళారిగా మొదలైన ఇతడి ప్రస్థానం.. ఇటీవల కార్పొరేటర్‌గా పోటీ చేసేంతగా చేరింది. ఇదంతా కేవలం భూదందాల ద్వారానే సంపాదించాడంటూ ఓ పోలీసు అధికారి తెలిపారు. ఘట్‌కేసర్‌కు చెందిన స్థిరాస్తి ఏజెంటు నకిలీ పత్రాలతో స్థలాలు విక్రయించిన కేసుల్లో నాలుగుసార్లు జైలుకెళ్లొచ్చాడు.  కీసర, ఘటకేసర్‌ చుట్టుపక్కల ప్లాట్ల విక్రయిస్తున్నట్టు ఓ స్థిరాస్తి వ్యాపార సంస్థ ఏజెంట్ల ద్వారా రూ.50కోట్లు వసూలు చేయించింది. ఆ డబ్బు సొంత ఖాతాలో వేసుకొని ప్లేటు ఫిరాయించారు. సొమ్ము చెల్లించిన బాధితులు ఏజెంట్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.


అసలు యజమానులకే ఝలక్‌..

కోట్ల విలువైన ప్లాట్లు/పంట భూములైనా తేలికగా కొట్టేయగల మోసగాళ్లు. మీ-సేవాకేంద్రాలు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, డాక్యుమెంట్‌ రైటర్లు, రెవెన్యూ కార్యాలయాలు వీరి స్థావరాలు. అక్కడ దరఖాస్తు చేసుకొనేందుకు వచ్చే యజమానుల వివరాలు సేకరిస్తారు.  ఖాళీగా ఉన్న స్థలాలు, ప్లాట్లు ఎక్కడెక్కడున్నాయనే వివరాలు రాబడతారు. వాటి యజమానులు దూరప్రాంతాల్లో ఉండటం, మరణించినట్టు నిర్ధారించుకున్నాక  రంగంలోకి దిగుతారు. స్థలం జిరాక్స్‌ కాపీలతో పత్రాలు పోయినట్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయిస్తారు. పైరవీలు/సొమ్ములు ఉపయోగించి పోలీసుల నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) తీసుకుంటారు. దాన్ని అడ్డుపెట్టుకొని నకిలీ ఆధార్‌, ఓటరు, పాన్‌కార్డులు తయారు చేయించి ఈ వ్యవహారం నడిపిస్తారు.

ఈనాడు, హైదరాబాద్‌-న్యూస్‌టుడే, కీసర

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు