logo

బేగంబజార్‌ హత్య కేసులో మిగిలిన ఇద్దరి కోసం గాలింపు

బేగంబజార్‌లో యువ వ్యాపారి నీరజ్‌ పన్వర్‌ హత్య కేసు నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పోలీసులు తాజాగా నిర్ధారించారు. సోదరి సంజన ప్రేమపెళ్లి

Published : 23 May 2022 02:32 IST

ఈనాడు, హైదరాబాద్‌ గోషామహల్‌, న్యూస్‌టుడే: బేగంబజార్‌లో యువ వ్యాపారి నీరజ్‌ పన్వర్‌ హత్య కేసు నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పోలీసులు తాజాగా నిర్ధారించారు. సోదరి సంజన ప్రేమపెళ్లి చేసుకుందనే పగతోనే ఆమె పెదనాన్న కుమారులు దారుణానికి తెగబడినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈనెల 20వ తేదీ రాత్రి 7.30 గంటలకు బేగంబజార్‌ చేపల మార్కెట్‌ సమీపంలోని యాదగిరి గల్లీ వద్ద నీరజ్‌ పన్వర్‌ను హతమార్చిన విషయం తెలిసిందే. మృతుడి భార్య సంజన ద్వారా కీలక వివరాలు పోలీసులు సేకరించారు. గతేడాది ఏప్రిల్‌లో నీరజ్‌ పన్వర్‌-సంజన ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఏడాది పాటు ఫలక్‌నుమా వద్ద అద్దె ఇంట్లో ఉన్నారు. కొద్దికాలంగా నీరజ్‌ పన్వర్‌ బేగంబజార్‌ రావటం.. సంజన సోదరులకు కనిపిస్తున్నాడు. తమను అవమానపరిచేందుకే ఇక్కడకు వస్తున్నారని నిందితులు పథకం ప్రకారం హత్యకు పాల్పడినట్టు పోలీసు అధికారులు స్పష్టం చేశారు. తల్లీబిడ్డకు ప్రాణహాని ఉందంటూ సంజన ఆందోళన వ్యక్తం చేయటంతో ఆదివారం అఫ్జల్‌గంజ్‌, షాహినాయత్‌గంజ్‌ పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. పశ్చిమ మండలం డీసీపీ జోయల్‌ డేవిస్‌ నేతృత్వంలో గోషామహల్‌ ఏసీపీ సతీశ్‌కుమార్‌ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

వారు పట్టుబడితే మరిన్ని వివరాలు.. కేసులో అరెస్టయిన విజయ్‌యాదవ్‌(22), సంజయ్‌యాదవ్‌(25), మరో ఇద్దరు మైనర్లను ఆదివారం సాయంత్రం 16వ అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి ఇంట్లో హాజరుపర్చగా రిమాండ్‌ విధించారు. నిందితులను చంచల్‌గూడ జైలుకు, మైనర్లను జువైనల్‌ హోంకు తరలించారు. పరారీలో ఉన్న ఏ1 అభినందన్‌యాదవ్‌, ఏ4 మహేశ్‌యాదవ్‌ల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని