logo

పుష్టిపై.. దృష్టి

పల్లె, పట్టణ ప్రాంతాల్లోని పిల్లలందరూ సాధారణ స్థితిలో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ క్రమంలో పోషణ లోపం, తీవ్రత అధికంగా ఉన్న చిన్నారులను గుర్తించి వారికి తగిన పౌష్టిక ఆహారాన్ని అందించి చిన్నారులను సాధారణ స్థితికి తేనున్నారు.

Updated : 25 Jun 2022 04:26 IST

పోషకలోప చిన్నారులకు బలవర్థక ఆహారం

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌

పల్లె, పట్టణ ప్రాంతాల్లోని పిల్లలందరూ సాధారణ స్థితిలో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ క్రమంలో పోషణ లోపం, తీవ్రత అధికంగా ఉన్న చిన్నారులను గుర్తించి వారికి తగిన పౌష్టిక ఆహారాన్ని అందించి చిన్నారులను సాధారణ స్థితికి తేనున్నారు. ఇటీవల యునిసెఫ్‌ బృందం జిల్లా కేంద్రంలో పర్యటించి, ప్రతి చిన్నారి ఆరోగ్యకరంగా ఎదిగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఇటువంటి వారికి మహిళా శిశుసంక్షేమ శాఖ ద్వారా బలవర్థకమైన ఆహారాన్ని అందించనున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న కథనం.

జిల్లాలో వ్యవసాయమే జీవనాధారం. రైతులు, కూలీలే ఎక్కువ. గర్భిణులు, బాలింతలు సైతం తినకుండానే పనులకు వెళ్తుంటారు. వీరంతా పేదరికంతోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. వీరికి తమ ఆరోగ్య విషయంలో తగిన అవగాహన ఉండదు. ఇక పుట్టబోయే బిడ్డ గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది తెలియదు. దీంతో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యసిబ్బంది గ్రామాల్లో పర్యటించి తగిన అవగాహన కల్పించడంతో కొంతవరకు ఈ పరిస్థితిని అధిగమిస్తున్నారు. గర్భిణులు ప్రసవం వరకు నాలుగు సార్లు, బాలింతలు 42 రోజల వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పరీక్షలకు వెళ్లి, వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలి.  

మూడు రకాలుగా గుర్తింపు
కేంద్రాలకు వచ్చే చిన్నారులను మూడు రకాలుగా గుర్తిస్తున్నారు. సాధారణ, తక్కువ స్థాయిలో ఉన్న పిల్లలను ‘మామ్‌’గా , తీవ్రత ఎక్కువ ఉన్నవారిని ‘సామ్‌’ అని గుర్తిస్తారు. ప్రతి నెలా అయిదేళ్ల లోపు ఉన్నవారి ఎత్తు, బరువు, చుట్టు కొలతను పరిశీలించి వారి స్థితిని తెలుసుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధరించిన ఎత్తుకు తగిన బరువు కేటగిరిని అనుసరించి లోపాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
ఆకలి నిర్ధారణ పరీక్షలు
‘సామ్‌’గా వ్యవహరించే వారికి మాత్రమే ఆకలి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ‘మామ్‌’గా వ్యవహరించేవారికి అవసరం లేదు. 7నుంచి 18 నెలల పిల్లలకు, కనీసం 15 గ్రాముల ప్లస్‌ బాలామృతం తిన్నట్టయితే ఆకలి పరీక్షలో ఉత్తీర్ణలైనట్లు లెక్కిస్తారు. 19నుంచి 36 నెలల పిల్లలు 30 గ్రామలు, 37 నుంచి 59 నెలల పిల్లలు 45 గ్రామలు తింటే పరీక్ష పాసైనట్లు లెక్క. దీని కన్నా తక్కువగా తింటే ఈ లాంటి పిల్లలను ‘సామ్‌’గా గుర్తించి వైద్యుడికి తెలియజేస్తారు. వెంటనే తగిన పరీక్షలు నిర్వహించి వారిని సాధారణ స్థితి వచ్చే మందులు, పోషక విలువలున్న ఆహారాన్ని అందజేయాలని సూచిస్తారు.
ప్లస్‌ బాలామృతమే
పిల్లల్లో పోషణ విలువను పెంచేందుకు ప్లస్‌ బాలామృతం కొత్తగా ప్రారంభించారు. సామ్‌ పిల్లలకు బాలామృతం ప్లస్‌తో పాటు పాలు, కోడిగుడ్లు, అన్ని రకాల విటమిన్లు ఖనిజ లవణాలు ఉన్న పోషక ఆహారాన్ని అందజేస్తారు. వీరికి ప్రతి రోజు నాలుగు సార్లు బాలామృతం ప్లస్‌ ఇస్తారు. మామ్‌ పిల్లల విషయంలో బాలామృతం ప్లస్‌ను ప్రతి రోజు రెండు సార్లు ఇస్తారు. ఇంట్లో వండిన ఆహార పదార్థాలను పెడతారు. మొదటి నెల నుంచి చికిత్స పూర్తయ్యేంత వరకు ప్రతి 15 రోజులకు ఒక సారి అంగన్‌వాడీ కార్యకర్త పర్యవేక్షిస్తారు.  


భోజనం ఇలా

కేంద్రాల్లో గర్భిణులకు, బాలింతకు, చిన్నారులకు ప్రతి రోజు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నారు. వీరికి అన్నం పప్పు, గుడ్డు, పాలు ఇస్తున్నారు. రెండు రోజులు పాటు పెరుగు అందిస్తున్నారు. ప్రతి కేంద్రంలో సరాసరి 8 నుంచి 15 మంది వరకు గర్భిణులు, బాలింతలు ఉన్నారు. చిన్నారులు కూడా ఇదే స్థాయిలో ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తోంది. లబ్ధిదారుల ఆరోగ్య వివరాలతో పాటు పిల్లల ఎత్తు బరువు నమోదు చేస్తున్నారు. కేంద్రాల్లో చదువు పూర్తయిన పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. కేంద్రాల్లో కొత్తగా చేరిన పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన చేస్తున్నారు. గర్భిణులకు సీమంతాలు చేస్తున్నారు.


సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషి
లలితకుమారి, జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారిణి, వికారాబాద్‌

పోషణ లోపం ఉన్న చిన్నారులను గుర్తించాం. వీరికి తగిన విధంగా బాలమృతం ప్లస్‌తో పాటు పాలు, కోడిగుడ్లు, అన్ని రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్న పౌషక ఆహారాన్ని అందించే విధంగా పర్యవేక్షిస్తాం. వీరిని సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం.


ఇవీ లెక్కలు
ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు: 5
అంగన్‌వాడీ కేంద్రాలు: 1,106
7 నెలల నుంచి 3ఏళ్ల చిన్నారులు: 40,516
మూడేళ్ల నుంచి 6 ఏళ్ల పిల్లలు: 20,686
బాలింతలు: 5,664
గర్భిణులు: 6,762
బరువు తక్కువగా పుట్టిన వారు: 12 శాతం
అత్యధిక పోషణలోపం ఉన్న పిల్లలు: 699
తక్కువ స్థాయిలో ఉన్న వారు: 2 వేలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని