logo

పాద బాట.. పక్క బాట

సుందరీకరణలో భాగంగా నగరవ్యాప్తంగా నిర్మించిన పాదబాటలు నడిచేందుకు వీల్లేకుండా తయారయ్యాయి. చిరు వ్యాపారుల ఆక్రమణలు, వ్యర్థాల పారబోత, పైపులతో నిండిపోయాయి. అక్కడివరకు నడుచుకుంటూ వచ్చి అడ్డంకులు ఉండడంతో రోడ్డు మీద నడవాల్సి వస్తోంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని

Updated : 25 Jun 2022 04:21 IST

అడుగడుగునా అడ్డంకులు, వ్యాపారాలు

 ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నడవాల్సిన దుస్థితి

ఈనాడు, హైదరాబాద్‌

సికింద్రాబాద్‌-చిలకలగూడ మార్గంలో...

సుందరీకరణలో భాగంగా నగరవ్యాప్తంగా నిర్మించిన పాదబాటలు నడిచేందుకు వీల్లేకుండా తయారయ్యాయి. చిరు వ్యాపారుల ఆక్రమణలు, వ్యర్థాల పారబోత, పైపులతో నిండిపోయాయి. అక్కడివరకు నడుచుకుంటూ వచ్చి అడ్డంకులు ఉండడంతో రోడ్డు మీద నడవాల్సి వస్తోంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళనతో ముందుకు సాగుతున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు కాలిబాటల పరిస్థితి దారుణంగా కనిపించింది.

పైపులు.. సామగ్రి డంపింగ్‌
అధికారుల పర్యవేక్షణ లోపం.. నిర్లక్ష్యం కారణంగా ఏళ్లుగా కాలిబాటలు ఆక్రమణల చెరలో చిక్కుకున్నాయి. రూ.కోట్లు వెచ్చించి ఆధునికీకరించిన ప్రాంతాల్లోనూ పనుల్లో నాణ్యతలేమి వల్ల టైల్స్‌ పైకి లేచి.. గుంతలు ఏర్పడి కాలు మోపలేని విధంగా తయారయ్యాయి. వివిధ పనుల నిమిత్తం పైపులు, ఇతర సామగ్రి డంప్‌ చేస్తున్నారు. నెలల తరబడి తొలగించడంలేదు.

కాపాడాల్సినోళ్లే కబళిస్తుంటే..
రహదారులను అభివృద్ధి చేసి కాలిబాటలను నిర్మించాల్సిన బాధ్యత జీహెచ్‌ఎంసీపై ఉంది. కొత్తగా రోడ్లు అభివృద్ధి చేస్తున్నా.. పాదబాటలు అభివృద్ధి చేసే విషయాన్ని పట్టించుకోవడం లేదు. 100 అడుగుల మార్గాలు 80 అడుగులకు కుంచించుకుపోయినా స్థానిక నేతలకు తలొగ్గి చోద్యం చూస్తున్నారు. నగరంలోని ఇన్నర్‌ రింగు రోడ్డులో కాలిబాట 20 శాతానికి మించి లేదు. స్వయంగా జీహెచ్‌ఎంసీ సుమారు 50 ప్రాంతాల్లో పాదబాటలపై రూ.5 భోజన కేంద్రాలు ఏర్పాటు చేసింది. విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్‌ వైర్ల స్తంభాలు, చెట్లు, కుండీలు, బస్టాపులు.. ఇలా చాలావాటికి నిలయం పాదబాటలే. రూ.65 కోట్లతో కొనుగోలు చేసిన ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ ప్రజా మరుగుదొడ్లను మూడేళ్ల క్రితం కాలిబాటలపై ఏర్పాటు చేయగా.. నిరుపయోగంగా మారి సెప్టిక్‌ ట్యాంకుల్లా తయారయ్యాయి. వాటర్‌ ఏటీఎం డబ్బాలది ఇదే పరిస్థితి.

పెలికాన్‌ సిగ్నళ్లు ఎక్కడ?
నగరంలో పాదబాట సరిగా లేక, రోడ్లు దాటే సమయంలో పాదచారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాటుతున్నారు. వంద చోట్ల పెలికాన్‌ సిగ్నల్స్‌ అవసరం ఉండగా.. కేవలం 20 చోట్ల మాత్రమే అందుబాటులోకి వచ్చాయి.
* హైటెక్‌సిటీ సమీపంలోని ఐకియా ఎదురుగా కొన్ని నెలలుగా ఫుట్‌పాత్‌పై పైపులు వేశారు. తొలగించాలని సామాజిక మాధ్యమాల్లో అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. పట్టించుకోవడం లేదని పాదచారులు వాపోతున్నారు.

మరికొన్నిచోట్ల ఇదీ పరిస్థితి
* సికింద్రాబాద్‌ ఒలిఫెంటా వంతెన వద్ద కాలిబాటలు పాడైపోయాయి.
*తార్నాక-ఓయూ మార్గంలో నడిచేందుకు వీల్లేకుండా తయారైంది.
* సికింద్రాబాద్‌-చిలకలగూడ మార్గంలో అడ్డంగా పైపులు పడేశారు.
* దిల్‌సుఖ్‌నగర్‌ ప్రధాన రహదారిలో బస్టాపులు ఏర్పాటయ్యాయి.
* నిమ్స్‌, ఎర్రమంజిల్‌ మెట్రో స్టేషన్‌ మధ్య కనీసం అడుగు పెట్టలేని పరిస్థితి.
* బేగంపేట విమానాశ్రయం ఎదురుగా, పైవంతెన పక్కనున్న కాలిబాట వాహనాల పార్కింగ్‌, దుకాణాలతో కనుమరుగైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని