Revanth Reddy: నాలుగేళ్ల విధుల తర్వాత పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా?: రేవంత్

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ ఉపసంహరణకు పోరాటం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Updated : 27 Jun 2022 16:37 IST

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ ఉపసంహరణకు పోరాటం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. సైనికులకు 6 నెలల శిక్షణ ఏం సరిపోతుందని ప్రశ్నించారు. అగ్నిపథ్‌ తీసుకొచ్చి యువత భవితను నాశనం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని మల్కాజిగిరి కూడలిలో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న రేవంత్‌ మాట్లాడారు.

ఈడీ దాడులకు కాంగ్రెస్‌ భయపడదు..

‘‘మోదీ ప్రభుత్వంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ఈడీతో దాడులు చేయించినా కాంగ్రెస్‌ భయపడదు. రైతులు, సైనికులను సమాజాన్ని నిర్మించే శక్తులుగా కాంగ్రెస్‌ గుర్తించింది. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే జవానులను అవమానించేలా మోదీ సర్కారు వ్యవహరిస్తోంది. నాలుగేళ్లు సైన్యంలో పని చేసి ఆ తర్వాత బడా పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా?

పార్టీలకు అతీతంగా కాపాడుకోవాలి..

అగ్నిపథ్‌తో ఉద్యోగ భద్రత లేదు. మాజీ సైనికుల హోదా లేదు. పింఛన్‌ రాదు. సికింద్రాబాద్ అల్లర్ల సందర్భంగా తెలంగాణ యువకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను దిల్లీలో ఉన్న కేటీఆర్‌ కోరాలి. పార్టీలకు అతీతంగా యువకులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అంటే కాంగ్రెస్‌ తెచ్చిన స్వాతంత్య్రాన్ని పణంగా పెట్టడమా? కోటి జనాభా లేని ఇజ్రాయెల్‌తో 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌ను పోలుస్తారా?

కేసీఆర్‌ తన వైఖరి తెలపాలి..

అగ్నిపథ్‌ నుంచి రిటైరయ్యాక యువకులకు ఏ ఉద్యోగాలు వస్తాయి? ఉద్యోగాలు లేక పక్కదారి పట్టి తీవ్రవాదంలో చేరితే ఎవరిదీ బాధ్యత. నిరసనకారులకు తెరాస సర్కార్‌ ఎందుకు న్యాయసాయం చేయడం లేదు. ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు అగ్నిపథ్‌పై తన వైఖరిని కేసీఆర్‌ స్పష్టం చేయాలి’’ అని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని