Justice Ujjal Bhuyan: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణం

తెలంగాణ హైకోర్టు ఐదో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం..

Updated : 28 Jun 2022 10:35 IST

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు ఐదో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణలో సీజేగా సేవలందించిన జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ దిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్న జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ సీజేగా పదోన్నతి పొందారు.

ఈయన 1964 ఆగస్టు 2న అస్సాం రాజధాని గువాహటిలో జన్మించారు. తండ్రి సుచేంద్ర నాథ్‌ భూయాన్‌ ఆ రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌గా సేవలందించారు. జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రాథమిక స్థాయి నుంచి ఎల్‌ఎల్‌ఎం వరకు గువాహటిలోనే విద్యాభ్యాసం పూర్తిచేశారు. 1991 మార్చి 20న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని అక్కడి హైకోర్టులో వృత్తి జీవితం ప్రారంభించారు. హైకోర్టు పరిధిలోని అగర్తల, షిల్లాంగ్‌, కొహిమా, ఈటానగర్‌ బెంచిల ముందు వాదనలు వినిపించారు. ఆదాయపన్ను శాఖ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు. 2002 ఏప్రిల్‌ నుంచి 2006 అక్టోబరు వరకు మేఘాలయలో ప్రభుత్వ అదనపు అడ్వొకేట్‌గా, 2005 నుంచి 2009 వరకు అరుణాచల్‌ప్రదేశ్‌ అటవీశాఖ ప్రత్యేక న్యాయవాదిగా సేవలందించారు.

2010 మార్చి 3న గువాహటి హైకోర్టు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 2010 సెప్టెంబరు 6న సీనియర్‌ అడ్వొకేట్‌ హోదా పొందారు. 2011 జులై 21న అస్సాం ప్రభుత్వ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా నియమితులయ్యారు. అదే ఏడాది అక్టోబరు 17న గువాహటి హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 20న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019 అక్టోబరు 3న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021 అక్టోబరు 22న తెలంగాణ హైకోర్టుకు వచ్చారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2021 అక్టోబరు 11 నుంచి పనిచేస్తున్న జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ఇకపై దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని