logo

Hyderabad News: బదిలీపై వెళ్తున్నా.. రూ.10 లక్షలకే ఇన్నోవా కారు

‘‘హాయ్‌.. నేను సుశాంత్‌ శర్మ.. సైన్యాధికారిగా పనిచేస్తున్నా.. కశ్మీర్‌కు బదిలీ అయ్యా.. అక్కడికి వెళ్తే నాకు కారుతో పని ఉండదు. అందుకే నా ఇన్నోవా కారును రూ.10 లక్షలకే అమ్మేస్తున్నా.. ముందు స్పందించిన వారికే అవకాశం..

Updated : 29 Jul 2022 07:00 IST
తప్పుడు ప్రకటనలతో సైబర్‌ నేరస్థుల మోసాలు
ఈనాడు, హైదరాబాద్‌

‘‘హాయ్‌.. నేను సుశాంత్‌ శర్మ.. సైన్యాధికారిగా పనిచేస్తున్నా.. కశ్మీర్‌కు బదిలీ అయ్యా.. అక్కడికి వెళ్తే నాకు కారుతో పని ఉండదు. అందుకే నా ఇన్నోవా కారును రూ.10 లక్షలకే అమ్మేస్తున్నా.. ముందు స్పందించిన వారికే అవకాశం.. యాభైశాతం అడ్వాన్స్‌ ఇస్తే ఇన్నోవా కారు పంపిస్తా.’’


‘‘సర్‌.. మార్కెట్‌ ప్లేస్‌లో మీ ప్రకటన చూశాం.. మీ బుల్లెట్‌ బైక్‌ను కొనేందుకు నిర్ణయించుకున్నా. మీరు చెప్పినట్టే రూ.లక్షకు కొంటా. ముందుగా రూ.50 వేలు పంపుతా. మీ బ్యాంక్‌ ఖాతా లేదా పేటీఎం, గూగుల్‌ పే నంబర్‌ చెబితే.. క్యూఆర్‌ కోడ్‌ పంపిస్తాను. దాన్ని స్కాన్‌ చేసి రూ.50 వేలు అంకె వేస్తే చాలు.. డబ్బు వస్తుంది సర్‌.’’


ఎల్‌ఎక్స్‌, గూగుల్‌ మార్కెట్‌ ప్లేస్‌ వెబ్‌సైట్ల ద్వారా సైబర్‌ నేరస్థులు కొత్తగా చేస్తున్న మాయాజాలమిది.  రాజస్థాన్‌ కేంద్రంగా సైబర్‌ నేరస్థులు కొద్ది నెలలుగా ఈ మోసాలకు పాల్పడుతున్నారు. ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలుంచిన వారితో మాట్లాడుతున్నారు. వారి వాహనం ఆర్‌సీ, ఆధార్‌ కార్డులు.. ఫోన్‌ చేసి ఇప్పించుకుంటున్నారు. అనంతరం వాహన యజమాని పేరు, నిందితుడి ఫొటోతో ఒక సైన్యాధికారి గుర్తింపు కార్డును తయారు చేస్తున్నారు. ఆర్‌సీ, ఆధార్‌ కార్డుపై వారి ఫోటోలుంచి బైకులు, కార్ల ఫొటోలను ప్రకటనలో ఉంచుతున్నారు. యాభై శాతం నుంచి అరవై శాతానికే ఇస్తామంటూ ఆశ పెడతుతున్నారు. ఇలా వందల సంఖ్యలో హైదరాబాద్‌, రంగారెడ్డి రిజస్ట్రేషన్ల కార్లు, బైకుల ఫొటోలు సేకరించారు. ప్రకటనలకు స్పందించిన వారి నుంచి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకూ బయానాగా తీసుకున్నాక..  ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారు.

మారుతి, ఇన్నోవా, యాక్టివా..

సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఓఎల్‌ఎక్స్‌లోని  స్కూటర్‌ను చూసి ప్రకటనలోని నంబరుకు ఫోన్‌ చేయగా.. రూ.36 వేలకే ఇస్తానని సైబర్‌ నేరస్థుడు చెప్పాడు. ఒకేసారి డబ్బు పంపించాలని.. తాను సైన్యంలో పనిచేస్తానంటూ వివరించడంతో.. ఆయన రూ.36 వేలు జమచేశాడు. స్కూటర్‌ ఎప్పుడు పంపుతారని ఫోన్‌ చేయగా..స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది.

* ఆనంద్‌నగర్‌లో ఉంటున్న రాములు మార్కెట్‌ ప్లేస్‌లో కారు అమ్ముతామన్న ప్రకటన చూశాడు. ప్రకటన కర్తను సంప్రదించగా.. రూ.3.2 లక్షలకు ఇస్తానని, బయానా రూ.32 వేలు ఇస్తే..రిజస్ట్రేషన్‌ చేయిస్తానని చెప్పాడు. నిందితుడి సూచనల మేరకు రూ.32 వేలు జమచేశాడు. కారు ఎక్కడుందని తెలుసుకునేందుకు ఫోన్‌ చేయగా.. నంబరు పనిచేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని