logo

కళా ఖండాలు.. ఉపాధికి నిలయాలు

దక్షిణాఫ్రికాలోని పీటర్‌మారిట్జ్‌బర్గ్‌ రైల్వేస్టేషన్‌లో చార్మినార్‌ చౌక్‌బండిలో తయారైన మహాత్ముడి విగ్రహం కొలువుదీరింది. నగరానికి చెందిన శిల్పులు మలిచిన చిత్రాలు అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తున్నాయి. ఇక్కడి కార్మికుల చేతుల్లో అందంగా రూపుదిద్దుకొని..

Published : 10 Aug 2022 02:45 IST

నగరం నుంచి దేశవిదేశాలకు విగ్రహాల ఎగుమతి
ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌

క్షిణాఫ్రికాలోని పీటర్‌మారిట్జ్‌బర్గ్‌ రైల్వేస్టేషన్‌లో చార్మినార్‌ చౌక్‌బండిలో తయారైన మహాత్ముడి విగ్రహం కొలువుదీరింది. నగరానికి చెందిన శిల్పులు మలిచిన చిత్రాలు అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తున్నాయి. ఇక్కడి కార్మికుల చేతుల్లో అందంగా రూపుదిద్దుకొని.. వివిధ ప్రాంతాల్లో కొలువుదీరుతున్నాయి. కేవలం ప్రముఖుల విగ్రహాలే కాకుండా యాదాద్రిలోని లక్ష్మీనరసింహస్వామి వ΄లవిరాట్‌కు బంగారు తొడుగులను నగరానికి చెందిన కళాకారులే తయారు చేశారు. చార్మినార్‌కు సమీపంలోని చౌక్‌బండి కా అడ్డా, మహబూబ్‌ చౌక్‌ మార్కెట్‌ ప్రాంతం అద్భుత కళాఖండాల తయారీకి నెలవు. నగరంతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి సైతం ఆర్డర్లు తీసుకొని ఆయా కళారూపాలు, విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందిన కొన్ని కుటుంబాలు దశాబ్దాల తరబడిగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నాయి. ఒకప్పుడు వెయ్యి కుటుంబాల వరకు ఉండగా.. ప్రస్తుతం చాలా కుటుంబాలు ఇతర వృత్తుల్లోకి మారినట్లు స్థానికులు చెబుతున్నారు. తమ పూర్వీకులు ఇచ్చిన కళాప్రతిభను 3040 కుటుంబాల వారు మాత్రం కొనసాగిస్తూ కళకు ప్రాణంపోస్తున్నారు.


నాలుగు దశలుగా పనులు..

విగ్రహాల కోసం మొదట అచ్చుపోస్తారు. అలా తయారైన విడి భాగాలను వెల్డింగ్‌ చేసి అతికించి ఓ రూపం తెస్తారు. తర్వాత ఆ ప్రతిమల్లోని లోపాలను సవరించడానికి ఫినిషింగ్‌ పనులు చేస్తారు. చివరగా బ్రష్‌తో శుభ్రం చేసి ఓ రసాయనంలో కొంతసేపు ఉంచుతారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కాపర్‌ కోటింగ్‌తో అందంగా రూపుదిద్దుకుంటాయి. ఏనుగు, గుర్రం, కోటకు కాపలా ఉండే సైనికులు, గణేశ్, రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణులు, మహాత్మాగాంధీ, నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్, భగత్‌సింగ్‌ విగ్రహాలు వారి కళా నైపుణ్యాన్ని కళ్లకు కడతాయి. ఇంట్లో ఆకర్షణీయంగా, పచ్చదనం కనిపించడానికి చిన్నచిన్న మొక్కలను పెంచే వస్తువులు తయారు చేస్తున్నారు.


రెండు రూపాల్లో గాంధీ విగ్రహం  రత్నమాచారి, చార్మినార్‌

క్షిణాఫ్రికాలోని పీటర్‌మారిట్జ్‌బర్గ్‌ రైల్వేస్టేషన్‌లో ప్రతిష్ఠించిన గాంధీ విగ్రహం మేమే రూపొందించాం. ఒక వైపు కళ్లద్దాలు ధరించి, ఖాదీ అంగవస్త్రంతో మనకు తెలిసిన గాంధీలా ఉండగా.. మరో వైపు టై ధరించి యువ న్యాయవాదిగా ఉంటారు. కేంద్ర విదేశాంగ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ అక్కడి స్టేషన్‌లో ఆవిష్కరించారు. నగరంలో చాలా వరకు ఆలయాల్లోని విగ్రహాలు తయారు చేశాం. లాల్‌ దర్వాజ, భాగ్యలక్ష్మి దేవాలయాల్లోని అమ్మవార్ల ప్రతిమలకు వెండి తొడుగులు తయారు చేశాం.


15 ఏళ్లుగా ఇదే వృత్తి..
షకీల్, చార్మినార్‌

వృత్తిని 15 ఏళ్లుగా కొనసాగిస్తున్నా. రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు వస్తాయి. ఈ ప్రతిమలను తయారు చేయడానికి పాత వాహనాల్లో లభించే అల్యూమినియం వినియోగిస్తాం. వాటిని ఒక్కో దశలో తీర్చిదిద్దుతూ అందంగా తయారు చేస్తాం. ఛత్రపతి శివాజీ, సరస్వతీ దేవి విగ్రహాలు రూపొందిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని