logo

వజ్ర సంకల్పం.. ప్రగతి దుర్గం

రాచరికపు అడ్డుగోడ దాటి స్వతంత్ర భారతంలోకి ప్రవేశించాక హైదరాబాద్‌ అభివృద్ధి ఎల్లలు దాటింది. ఆనాటి హైదరాబాద్‌ అంటే.. మూసీకి దక్షిణాన ఉన్న రాజ సౌధాలు, ఉత్తరాన అక్కడక్కడ కనిపించే బంగ్లాలు. నేడు ఆ పరిస్థితి లేదు. నగరం నాలుగు

Updated : 15 Aug 2022 05:53 IST

నగర సిగలో కీర్తి కిరీటాలెన్నో

75 ఏళ్ల  అభివృద్ధి ప్రస్థానం ఇదీ

ఈనాడు, హైదరాబాద్‌

రాచరికపు అడ్డుగోడ దాటి స్వతంత్ర భారతంలోకి ప్రవేశించాక హైదరాబాద్‌ అభివృద్ధి ఎల్లలు దాటింది. ఆనాటి హైదరాబాద్‌ అంటే.. మూసీకి దక్షిణాన ఉన్న రాజ సౌధాలు, ఉత్తరాన అక్కడక్కడ కనిపించే బంగ్లాలు. నేడు ఆ పరిస్థితి లేదు. నగరం నాలుగు విశాలమైన జిల్లాలుగా, కోటి మంది జనాభా, రూ.5,500కోట్ల వార్షిక పద్దుతో పాలించే గ్రేటర్‌ హైదరాబాద్‌గా ఆవిష్కృతమైంది. దినదినాభివృద్ధి చెందుతూ.. పరిపాలన, నిర్మాణాలు, రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో భాగ్యనగరం ప్రపంచపటంలో చెరగని ముద్ర వేసుకుంది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఏడున్నర దశాబ్దాల నగర అభివృద్ధి ప్రస్థానం ఇది..


ఐటీ, పరిశోధన, రవాణా, విద్య, వాయురవాణా, పరిశ్రమలు.. ఇలా ఒకటేమిటి హైదరాబాద్‌తో ముడిపడిన ప్రతి అంశమూ నగరంతో అనుసంధానంగా ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనే ఉంటుంది. స్వతంత్ర భారతావని ఆవిర్భవించిన తొలినాళ్లలో రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలతో భయానకంగా ఉన్న ప్రదేశాలన్నీ ఇప్పుడు మినీ నగరాలు, పట్టణాలుగా రూపుదాల్చాయి.


విద్యారంగం

విద్యారంగంలో దేశంలోనే గమ్యస్థానంగా హైదరాబాద్‌ మారింది. 1974లో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ హెచ్‌సీయూ ఏర్పాటైంది. తర్వాత ప్రముఖ విద్యాసంస్థలెన్నో హైదరాబాద్‌ శివార్లలో ఏర్పాటయ్యాయి. ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌, ఐఐటీ హైదరాబాద్‌, బిట్స్‌, నల్సార్‌ వంటి ప్రముఖ విద్యాసంస్థలతోపాటు నైపర్‌, టీఐఎఫ్‌ఆర్‌, జంతు పరిశోధన సంస్థ తదితర పరిశోధన సంస్థలు వచ్చాయి. 3 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు సహా మరో 23 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. నగరం సహా చుట్టుపక్కల 650 కళాశాలలు ఏర్పాటయ్యాయి.


అవుటర్‌  రింగు రోడ్డు...

హైదరాబాద్‌కే తలమానికమైన అవుటర్‌ రింగు రోడ్డు మొత్తం విస్తీర్ణం 158 కిలోమీటర్లు. ఇతర నగరాల్లో ఎక్కడా లేని విధంగా పూర్తి వలయాకారంగా నిర్మితమైన రహదారి మార్గం ఇదే కావడం విశేషం. అన్నిజాతీయ రహదారులు, రైల్వే మార్గాలతో అనుసంధానితమైన ఉన్న ఏకైక మార్గం ఇదే.


ఐటీలో మేటి..

హైదరాబాద్‌లో 1995లో మొదటి ఐటీ భవనం సైబర్‌ టవర్స్‌ నిర్మాణమైంది. అప్పటి నుంచి ఐటీ దినదినాభివృద్ధి చెందుతోంది.


పరిశ్రమలు

హైదరాబాద్‌లో పరిశ్రమ లేదా కంపెనీ పెట్టాలనుకునే ప్రతి సంస్థకు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలే గమ్యస్థానం. ఒకప్పుడు, అజామాబాద్‌, కార్ఖానా, ముషీరాబాద్‌, సనత్‌నగర్‌ ప్రాంతాల్లో ఉండేవి. తర్వాత బాలానగర్‌, జీడిమెట్ల, కాటేదాన్‌గా మారాయి. ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో రెండు జిల్లాల్లోనే పరిశ్రమలున్నాయి.


ఘనం.. విమానయానం

ప్రారంభం: మార్చి 23, 2008
రోజూవారీ ప్రయాణికులు: 50వేలు
రాకపోకలు సాగించే విమానాలు: 350-400

దేశంలో అత్యంత రద్దీ ఉన్న విమానాశ్రయాల్లో మూడో స్థానం.. దక్షిణాసియాలోనే మూడో ఉత్తమ విమానాశ్రయం.. ఆధునిక సాంకేతికత వినియోగంలో మొదటిస్థానం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు సంపాదించుకున్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రంగారెడ్డి జిల్లాలోనే ఏర్పాటైంది.

సముద్ర తీరానికి దూరంగా ఉన్న నగరాల్లో ఎగుమతులు, దిగుమతుల దృష్ట్యా దేశంలో రెండో పెద్ద నగరంగా హైదరాబాద్‌ గుర్తింపు పొందింది. విమానాశ్రయం వల్లే ఇది సాధ్యమైంది.


ఔషధ రంగంలో విశ్వగురు..

శామీర్‌పేట పరిధిలోని 600 ఎకరాల్లో 1999లో ప్రభుత్వం జినోమ్‌వ్యాలీని ఏర్పాటుచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే టీకాల్లో మూడో వంతు అక్కడే తయారవుతున్నాయి. కొవిడ్‌-19ను అదుపు చేసే టీకాలూ అక్కడే తయారయ్యాయి. భారత్‌ బయోటెక్‌, ఇతరత్రా సంస్థలు ఔషధ రంగంలో విస్తృతమైన పరిశోధనలు చేస్తున్నాయి. ఫార్మారంగానికి రంగారెడ్డి జిల్లాలోని ఫార్మాసిటీ సరికొత్త చిరునామాగా మారనుంది.
ఫార్మాసిటీ మొత్తం విస్తీర్ణం: 19,333.20 ఎకరాలు
రానున్న పరిశ్రమలు: 1200కుపైగా
పెట్టుబడులు : 8.4 బిలియన్‌ డాలర్లు
కల్పించనున్న ఉద్యోగాలు: 5.60లక్షలు


విశ్వ వైద్య విపణి.. భాగ్యనగరి

హైదరాబాద్‌లో ప్రస్తుతమున్న అత్యంత ఆధునిక వైద్య సదుపాయాల కారణంగా దేశంలోని రోగులే కాకుండా విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు.
ప్రస్తుతం 50 పడకలలోపు మినీ ఆస్పత్రులు: 150 నుంచి 200
10-20 పడకల క్లినిక్‌లు, నర్సింగ్‌హోంలు: 3-4 వేలు
200 పైగా పడకల ఆస్పత్రులు: 25-30


తాగునీటికి భరోసా

స్వాతంత్య్రానికి పూర్వం కేవలం 5 లక్షల మందికి తాగునీటిని అందిస్తే... ప్రస్తుతం దాదాపు కోటికి చేరింది.

జలమండలి మొత్తం సర్వీసు ఏరియా: 1451.91 చ.కి.మీ

నల్లాలు: 11 లక్షలు

ప్రతి ఒక్కరికి రోజుకు అందే నీరు: 150 లీటర్లు

నిత్యం సరఫరా: 682 మిలియన్‌ గ్యాలన్లు


వైద్య పరికరాల తయారీలో..

భారత దేశం వైద్య పరికరాల కోసం విదేశాలపై ఎక్కువగా ఆధారపడేది. ఇప్పుడు పరిస్థితి మారింది. 2017లో నగరంలోని సుల్తాన్‌పూర్‌లో 302 ఎకరాల్లో ఏర్పాటైన మెడికల్‌ డివైజెస్‌ పార్కుతో దేశీయ అవసరాలు పెద్దఎత్తున తీరుతున్నాయి. దిగుమతులు తగ్గాయి. పార్కులో రూ.1500కోట్ల పెట్టుబడులతో 50కి పైగా సంస్థలు 7వేల మందితో పనిచేస్తున్నాయి.


మినీ పట్టణాలు, నగరాలు

హైదరాబాద్‌ చుట్టుపక్కల ఆవాసాలు పెరిగిపోతుండటంతో మినీ పట్టణాలు, నగరాలు పుట్టుకొచ్చాయి. 22 పట్టణాలు, 7 మినీ నగరాలు ఆవిర్భవించాయి. మరో 35 చిన్న పట్టణాలు అభివృద్ధిలో దూసుకెళుతున్నాయి.


క్షిపణుల అభివృద్ధి, ఉత్పత్తిలో కీలకం

దేశానికి వ్యూహాత్మక ప్రాంతం హైదరాబాద్‌ కావడంతో డీఆర్‌డీవోకు చెందిన పలు పరిశోధన సంస్థలు, రక్షణ రంగానికి చెందిన ఉత్పత్తి సంస్థలు నెలకొల్పారు. 1961లో కంచన్‌బాగ్‌లో తొలుత ఏర్పాటు చేసిన డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్స్‌ రీసెర్చ్‌ ల్యాబరేటరీ(డీఎల్‌ఆర్‌ఎల్‌) తర్వాత డీఎంఆర్‌ఎల్‌, డీఎల్‌ఆర్‌ఎల్‌, ఏఎస్‌ఎల్‌, ఆర్‌సీఐ ఒక్కోటిగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. వీటన్నింటిని కలిపి మిసైల్‌ కాంప్లెక్స్‌గా పిలుస్తున్నారు. క్షిపణులకు డీఆర్‌డీవో రూపకల్పన చేయగా మెటీరియల్స్‌ మిథానీలో తయారైతే... బీడీఎల్‌, హెచ్‌ఏఎల్‌ ఉత్పత్తి చేసేది. క్షిపణుల అవసరాలు తీర్చేందుకు ఆర్‌సీఐ వంటి కొత్త ల్యాబ్‌లను ఏర్పాటుచేశారు.  

* క్షిపణులతో సహా మరెన్నో రక్షణ ఉత్పత్తుల తయారీ చేసే భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ 53 ఏళ్ల ప్రస్థానంలో ఎంతో పురోగతి సాధించింది.

* 2021-22  ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి బీడీఎల్‌ రూ.2817 కోట్ల టర్నోవర్‌ సాధించింది.

* రూ.13వేల కోట్ల ఆర్డర్లు చేతిలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని