logo

వివాహేతర సంబంధంపై ప్రశ్నించినందుకు కిడ్నాప్‌.. దాడి

అతడు చర్చిలో పాస్టర్‌.. వావివరసలు మరిచి బావమరిది భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం ఆమె భర్తకు తెలిసిందని గ్రహించి, తన స్నేహితులను...

Updated : 29 Sep 2022 03:03 IST

ప్రధాన సూత్రధారి పాస్టర్‌ సహా నలుగురి రిమాండ్‌

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే అతడు చర్చిలో పాస్టర్‌.. వావివరసలు మరిచి బావమరిది భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం ఆమె భర్తకు తెలిసిందని గ్రహించి, తన స్నేహితులను పంపి ఆయన్ను అపహరించాడు. ఆనక వారంతా బాధితుడిపై దాడిచేసి, బెదిరించడంతోపాటు చరవాణిలోని వీడియోలనూ డిలీట్‌ చేయించారు. తప్పించుకున్న బాధితుడు స్వగ్రామానికి వెళ్లి తలదాచుకున్నాడు. 13 రోజుల తర్వాత నగరానికి తిరిగివచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పాస్టర్‌ను, సహకరించిన వారిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. డీఎస్పీ భీమ్‌రెడ్డి, సీఐ శ్రీనివాసులురెడ్డి బుధవారం వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు టైలర్‌బస్తీకి చెందిన రాయని రాజు ఏడేళ్ల క్రితం భార్యతో కలిసి అమీన్‌పూర్‌కు చేరుకున్నాడు. స్థానిక న్యూసాయిభగవాన్‌ కాలనీలో ఉంటున్నాడు. రాజు కుమార్తెలిద్దరూ ఏపీలోని మంగళగిరిలో అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. భార్య ప్రవర్తనలో తేడాను కొంతకాలంగా గమనిస్తోన్న రాజు.. ఈ నెల 5న బయటకెళ్లాడు. అంతకుముందే తన చరవాణిలో వీడియో రికార్డింగ్‌ ఆన్‌చేసి ఇంట్లో పెట్టాడు. రాత్రి తిరిగొచ్చాక పరిశీలించాడు. తన బావ, బీరంగూడ మంజీరానగర్‌ చర్చిలో పాస్టర్‌గా పనిచేసే తిట్ల శిఖామణి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు గుర్తించాడు. భార్యను నిలదీయగా.. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. శిఖామణిని సైతం ప్రశ్నించాడు. ఈ నెల 13న రాత్రి రాజు ఒంటరిగా ఉన్న సమయంలో శిఖామణి స్నేహితులు కిరణ్‌గౌడ్‌, మల్లేష్‌, సాయి, దినేష్‌, పర్శప్పలు ఇంట్లోకి ప్రవేశించి రాజును బలవంతంగా కారులో ఎక్కించుకొని ఓ వెంచర్‌లోకి తీసుకెళ్లారు. తర్వాత రామచంద్రాపురం తీసుకెళ్లి అస్లంఖాన్‌కు చెందిన ఫొటో స్టూడియోలో నిర్బంధించారు. కట్టెలతో రాజును కొట్టి, వివాహేతర సంబంధం విషయాన్ని బహిర్గతం చేస్తే చంపేస్తామని బెదిరించారు. రాజు రికార్డు చేసిన వీడియోను డిలీట్‌ చేశారు. మర్నాడు ఉదయం రాజు తప్పించుకుని ఇల్లందు చేరుకున్నాడు. ఈ నెల 26న అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై సుభాష్‌ కేసు నమోదుచేసి, ప్రధాన సూత్రధారి శిఖామణితోపాటు కిరణ్‌గౌడ్‌, మల్లేష్‌, అస్లంఖాన్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. సాయి, దినేష్‌, పర్శప్పలు పరారీలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని