logo

Hyderabad: అందరి చూపు.. 3 BHK ఫ్లాట్ల వైపే..

రాజీవ్‌ స్వగృహకు సంబంధించి బండ్లగూడ, పోచారంలోని ఫ్లాట్లలో ఎక్కువ మంది 3బీహెచ్‌కె, 3బీహెచ్‌కె డీలక్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.

Updated : 20 Oct 2022 08:15 IST

500 మంది వరకు డీడీల చెల్లింపు

ఈనాడు, హైదరాబాద్‌: రాజీవ్‌ స్వగృహకు సంబంధించి బండ్లగూడ, పోచారంలోని ఫ్లాట్లలో ఎక్కువ మంది 3బీహెచ్‌కె, 3బీహెచ్‌కె డీలక్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటివరకు 500 మంది టోకెన్‌ అడ్వాన్సుకు డీడీలు తీయగా... అందులో 300 మంది వరకు ఆ రెండు రకాల ఫ్లాట్లనే ఎంచుకున్నారు. గతంలో బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లకు లాటరీ నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 35 వేల మంది రూ.వేయి వంతున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. అయితే లాటరీలో ఫ్లాట్లు దక్కించుకున్న వారిలో కేవలం 900 మంది మాత్రమే టోకెన్‌ అడ్వాన్సులు చెల్లించి ఫ్లాట్లను కొనేందుకు ముందుకొచ్చారు. ఇవిపోను...బండ్లగూడ, పోచారంలో అన్ని రకాల ఫ్లాట్లు కలిపి ప్రస్తుతం 2300 వరకు మిగిలిపోయాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటికే రూ.వేయి చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారందరికి అధికారులు మరో అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. టోకెన్‌ అడ్వాన్సు చెల్లిస్తే...మరోసారి ఇలాంటి వారికి లాటరీ ద్వారా ఫ్లాట్లు కేటాయించాలని నిర్ణయించారు. అయితే ఖాళీగా ఉన్న ఫ్లాట్ల కంటే తక్కువ మంది టోకెన్‌ అడ్వాన్సు చెల్లిస్తే...ఎలాంటి లాటరీ లేకుండానే అప్పగించనున్నారు. ఒకవేళ ఫ్లాట్ల కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఉంటే లాటరీ నిర్వహించి అందులో గెలుపొందిన వారికి కేటాయిస్తారు. మిగిలిన వారికి అడ్వాన్సును తిరిగి చెల్లిస్తారు. 2బీహెచ్‌కె, 1బీహెచ్‌కెలకు మాత్రం ఆదరణ తక్కువగా ఉండటం వల్ల వీటిని సులువుగా దక్కించుకునే వీలు ఉంది. తాజా లాటరీలో పాల్గొనాలంటే 1బీహెచ్‌కెకు రూ.లక్ష, 2బీహెచ్‌కెకు రూ.2 లక్షలు, 3బీహెచ్‌కె, డీలక్స్‌ ఫ్లాట్లకు రూ.3 లక్షల వంతున టోకెన్‌ అడ్వాన్సు కింద నిర్ణయించారు. ఈ అడ్వాన్సు చెల్లింపునకు ఈ నెల 26 చివరి తేదీగా నిర్ణయించారు. వరుస సెలవుల దృష్ట్యా ఈ తేదీని కూడా పొడిగించే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల బోగట్టా. మరో 15-30 రోజులు పెంచవచ్చునని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని