logo

Super star Krishna: ఎవరు పిలిచినా మేమున్నామంటూ..

నానక్‌రాంగూడతో నటశేఖర కృష్ణకు ప్రత్యేక అనుబంధం ఉంది. అక్కడ ఆయన 90వ దశకంలోనే స్థానిక రైతుల నుంచి స్థలాన్ని కొనుగోలు చేశారు.

Updated : 16 Nov 2022 07:53 IST

నానక్‌రాంగూడలో అయ్యప్ప పడిపూజలో కృష్ణ దంపతులు

రాయదుర్గం, గచ్చిబౌలి, న్యూస్‌టుడే: నానక్‌రాంగూడతో నటశేఖర కృష్ణకు ప్రత్యేక అనుబంధం ఉంది. అక్కడ ఆయన 90వ దశకంలోనే స్థానిక రైతుల నుంచి స్థలాన్ని కొనుగోలు చేశారు. అందులో ఆదిలో ఇంటిని నిర్మించారు. ఐటీ సంస్థలు, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ రాకపూర్వమే ప్లానెట్‌ టెన్‌ పేరుతో వినోద కేంద్రం ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని ప్లానెట్‌ టెన్‌ కూడలిగా స్థానికులు చెబుతుంటారు. కొన్నాళ్ల తర్వాత అక్కడే భవనం నిర్మించి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. పుష్కర కాలానికి పైగా కృష్ణ, విజయనిర్మల దంపతులు అక్కడే నివాసం ఉన్నారని గ్రామస్థులు తెలిపారు. ఈ క్రమంలో వారికి గ్రామంతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. స్థానికులకు సహకారం అందించే వారు. వివాహాలు తదితర శుభకార్యాలకు ఎవరు పిలిచినా దంపతులిద్దరూ వచ్చేవారని గ్రామస్థులు చెప్పారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

అయ్యప్పస్వామి పూజలో..: గ్రామంలో ఏటా జరిగే అయ్యప్ప స్వామి పూజకు కృష్ణ దంపతులిద్దరూ వచ్చి  అన్నదానం చేసేవారు. దివ్యజ్యోతి పేరుతో ఆడియో సీడీలను కృష్ణ చేతుల మీదుగానే ఆవిష్కరించేవారు. స్థానిక పోచమ్మ దేవాలయానికి సహకారం అందించేవారు. అమ్మవారి అలంకరణ కోసం వారు వెండి ఆభరణాలు అందజేశారని బస్తీ వాసులు తెలిపారు.  

ప్రతి ఎన్నికలో ఓటు హక్కు: కృష్ణ, విజయ నిర్మల దంపతులు ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కును వినియోగించుకుంటారు. చివరిసారిగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా ఓటు వేశారు. నానక్‌రాంగూడ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రానికి వచ్చేవారు. కృష్ష, విజయ నిర్మల దంపతుల పుట్టిన రోజు వేడుకలను గ్రామంలోని వారి నివాసం వద్ద ఘనంగా నిర్వహిస్తారు.  

ఇంటి వద్దే సందర్శన ఏర్పాట్లు:  కృష్ణను కడసారి చూసేందుకు మంగళవారం రాత్రి వరకు అభిమానులు భారీగా తరలివచ్చారు. తొలుత అభిమానుల సందర్శన కోసం పార్థివదేహాన్ని గచ్చిబౌలి స్టేడియానికి తీసుకెళ్లాలనుకున్నారు. ఏర్పాట్లు కూడా చేశారు. ఆ తర్వాత అక్కడికి తీసుకెళ్లే నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఇంటి వద్దే బారికేడ్లను ఏర్పాటు చేసి అభిమానులు, గ్రామస్థులు వరుసలో వచ్చి సందర్శించేలా చర్యలు తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని