logo

Hyderabad: భార్యతో వివాదం.. బాంబు ఉందంటూ పోలీసులకు కాల్‌ చేశాడు!

భర్త తీరుతో విసిగి ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను తిరిగి కాపురానికి రప్పించేందుకు సొంతంగా ప్రయత్నాలు చేశాడు.  

Updated : 17 Nov 2022 07:22 IST

బాంబు ఉందంటూ తప్పుడు కాల్‌  

నిందితుడికి 18 రోజుల జైలుశిక్ష  

ఐఎస్‌సదన్‌లో తనిఖీలు చేస్తున్న బాంబు నిర్వీర్య బృందం

సైదాబాద్‌, న్యూస్‌టుడే: భర్త తీరుతో విసిగి ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను తిరిగి కాపురానికి రప్పించేందుకు సొంతంగా ప్రయత్నాలు చేశాడు.  పోలీసులనూ ఆశ్రయించాడు. ఫలితం కనిపించకపోవడంతో పోలీసులపై ఆగ్రహంతో బాంబు బూటకపు కాల్‌తో అర్ధరాత్రి పరుగులు పెట్టించాడు. పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరపర్చగా న్యాయమూర్తి 18 రోజులు జైలుశిక్ష విధించారు.

సైదాబాద్‌ ఠాణా పరిధిలో మంగళ/బుధవారాల్లో జరిగిన ఈ సంఘటన పోలీసుల వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట రియాసత్‌నగర్‌ డివిజన్‌ రాజనర్సింహనగర్‌కు చెందిన మహమ్మద్‌ అక్బర్‌ఖాన్‌ జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. దంపతుల మధ్య వాగ్వాదాలు జరిగేవి. ఇటీవల  పిల్లలను తీసుకుని భార్య చౌటుప్పల్‌లో ఉంటున్న తల్లి ఇంటికి వెళ్లిపోయింది. కాపురానికి పంపాలని పలుమార్లు కోరినా ఫలితం లేక చౌటుప్పల్‌ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.

మంగళవారం రాత్రి ఐఎస్‌సదన్‌ కూడలిలో మందిర్‌-మసీదు వద్ద బాంబు ఉందని డయల్‌ 100కు సమాచారం ఇచ్చాడు.  బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు వచ్చి అర్ధరాత్రి గాలించినా ఎలాంటి ఆనవాళ్లూ కనిపించలేదు. కాల్‌ ట్రాక్‌ ద్వారా ఫోన్‌ చేసిన వ్యక్తి ఆచూకీ తెలుసుకుని.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం నాంపల్లి ఏడో స్పెషల్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపర్చగా జైలుశిక్షను విధిస్తూ న్యాయమూర్తి లక్ష్మణ్‌రావు తీర్పు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని