logo

అరకొర కేంద్రాలు... కొనుగోలుకు పడిగాపులు

జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ధాన్యం కేంద్రాలను ప్రారంభించి కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నా సకాలంలో కార్యరూపం దాల్చడం లేదు

Published : 30 Nov 2022 01:58 IST

న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌  మున్సిపాలిటీ, దౌల్తాబాద్‌, దోమ  

జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ధాన్యం కేంద్రాలను ప్రారంభించి కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నా సకాలంలో కార్యరూపం దాల్చడం లేదు. ప్రారంభించిన వాటిలోనూ సేకరణలో జాప్యం జరుగుతోంది. దీంతో చాలా మంది కేంద్రాల వద్ద ధాన్యంతో పడిగాపులు కాస్తుండగా మరికొందరు వ్యవసాయ క్షేత్రాల్లోనే నిల్వ ఉంచి నిరీక్షిస్తున్నారు.  

రికార్డు స్థాయిలో సాగు

*వానాకాలం వరి సాధారణ సాగు 53,864 ఎకరాలు ఉండగా రికార్డు స్థాయిలో 1,34,066 ఎకరాల విస్తీర్ణంలో సాగులోకి వచ్చింది. అధికారులు కూడా ఆ మేరకు కేంద్రాలు అవసరమని భావించారు. ఈక్రమంలోనే 226 కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించి ఇప్పటి వరకు సగం కూడా అందుబాటులోకి రాలేదు.

అటాచ్‌మెంట్‌ చేయక

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన చోట నిర్వాహకులు సేకరణ ప్రారంభించలేదు. అదేమని అడిగితే తీసుకున్న ధాన్యం ఎక్కడికి పంపాలన్నది ఇంకా అటాచ్‌ చేయలేదని చెబుతున్నారు. గత శుక్రవారం పరిగి వ్యవసాయ మార్కెట్లో క్వింటాలు వరి ధాన్యం రూ.1810 నుంచి రూ.1950 వరకు ధర పలికింది. ప్రభుత్వ కనీస మద్దతు ధర ‘ఎ’ గ్రేడ్‌ రకం రూ.2060 ఉండగా ‘బి’ గ్రేడ్‌ రకానికి రూ.2040 ఉంది. దీంతో క్వింటాలుకు రూ.500 లకు పైగా తేడా రావడం, కమిషన్‌ అధికంగా ఉండటంతో మరింత నష్టపోవాల్సి వస్తోందని భావిస్తున్న రైతులు కేంద్రాలపైనే ఆధారపడ్డారు.  

పక్షం రోజులుగా పొలంలోనే..
- రవీందర్‌, రైతు, గోకపస్లాబాద్‌, దౌల్తాబాద్‌

నాకున్న రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేశా. వారం క్రితం గ్రామంలో కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. మిల్లులకు అటాచ్‌మెంట్‌ చేయకపోవడంతో నిర్వాహకులు మరికొద్ది రోజులు ఆగాలని చెబుతున్నారు. దీంతోనే పొలంలోనే నిల్వ చేసుకోవాల్సి వస్తోంది.  

ట్రాక్టరు అద్దె భారం..
- రాములు, రైతు, లింగన్‌పల్లి

మూడెకరాల్లో పండించిన ధాన్యాన్ని దోమ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చా. అక్కడ రైతుల సంఖ్య అధికంగా ఉండటంతో నిరీక్షించాల్సి వచ్చింది. రోజుకు ట్రాక్టరు కిరాయి రూ.500 వరకు భారం పడుతోంది.

చర్యలు తీసుకుంటున్నాం
- రాజేశ్వర్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి

జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 127 కేంద్రాలను ప్రారంభించాం. ఇంకొన్ని చోట్ల ఇంకా రైతులు ముందుకు రావడం లేదు. కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. సంబంధిత ఏఈఓలు ఎక్కడికి అటాచ్‌ చేయాలన్నది స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారు.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని