logo

మహా రుణాన్వేషణ

మహానగరంలో కీలక అభివృద్ధి పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం రుణాన్వేషణ ప్రారంభించింది. సమగ్ర రోడ్ల అభివృద్ధి కార్యక్రమం(ఎస్‌ఆర్‌డీపీ), వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్‌ఎన్‌డీపీ) రెండో దశ కోసం దాదాపు రూ.3 వేల కోట్లు అవసరం.

Updated : 01 Dec 2022 06:29 IST

ఎస్‌ఎన్‌డీపీ, ఎస్‌ఆర్‌డీపీ రెండో దశపై అధికారుల సమాలోచనలు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: మహానగరంలో కీలక అభివృద్ధి పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం రుణాన్వేషణ ప్రారంభించింది. సమగ్ర రోడ్ల అభివృద్ధి కార్యక్రమం(ఎస్‌ఆర్‌డీపీ), వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్‌ఎన్‌డీపీ) రెండో దశ కోసం దాదాపు రూ.3 వేల కోట్లు అవసరం. వీటిని హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) గానీ సమీపంలోని నగరపాలక సంస్థలు గానీ భరించే స్థితిలో లేవు. ఈ నేపథ్యంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పనులు మొదలుపెట్టాలని సర్కార్‌ నిర్ణయించింది. రుణాలు ఎలా తీసుకోవాలన్న దానిపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.

ఇప్పటికే రూ.6 వేల కోట్లు..

నగరంలో ఎస్‌ఆర్‌డీపీ కింద అనేక చోట్ల పైవంతెనలు నిర్మించారు. రోడ్లను విస్తరించారు. దీనివల్ల చాలా చోట్ల ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం దొరికింది. చిన్నపాటి వర్షానికి కాలనీలు ముంపునకు గురవుతున్న నేపథ్యంలో కొత్తగా నాలాల నిర్మాణానికి ఎస్‌ఎన్‌డీపీ ప్రాజెక్టు ఏడాదిన్నర కిందట మొదలుపెట్టారు. బల్దియా పరిధిలోనే కాకుండా సమీపంలోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో కూడా నాలాల విస్తరణ పనులు మొదలపెట్టారు. రెండు కార్యమ్రాల వల్ల మహానగరంలో చక్కటి ఫలితాలు ఒనగూరుతున్నాయి. దీంతో రెండో దశ కింద కూడా మరికొన్ని కీలకమైన పనులను చేపట్టాలని సర్కార్‌ నిర్ణయించింది. ఇప్పటికే మొదటి దశ కింద దాదాపు రూ.6 వేల కోట్ల పైచిలుకు నిధులను రుణంగా సర్కార్‌ తీసుకుంది. ఈ రుణ మొత్తాన్ని బల్దియానే తీర్చాల్సింది. రెండో విడతకు అవసరమైన రూ.3 వేల కోట్లూ రుణం తీసుకోవాలా సర్కారే సొంత నిధులతో వీటిని చేపడుతుందా అన్న దానిపై అధికారులు కొద్ది రోజులుగా చర్చిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంత పెద్ద మొత్తంలో నిధులు సర్కార్‌ భరించే పరిస్థితి లేదు. దీంతో రుణం తీసుకోవాలన్న నిర్ణయానికి అధికారులు వచ్చినట్లు చెబుతున్నారు. అప్పు ఎలా తీసుకోవాలి.. బ్యాంకులకు సర్కారే హామీ ఇవ్వాలా...లేని పక్షంలో జీహెచ్‌ఎంసీ తరఫున ఆస్తులు చూపించాలా అన్నదానిపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. ‘కొద్ది రోజుల్లోనే రుణంపై స్పష్టత వస్తుంది. మార్చి తర్వాత పనులు మొదలు కావడం ఖాయం’ అని బల్దియా అధికారి ఒకరు ఈనాడుకు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని