logo

మీరు ఆ ఖాతాలో పడకండి

‘హాయ్‌ డియర్‌.. నా పాకెట్‌ మనీతో నిన్న ఒక అద్భుతం జరిగింది. బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడితే నమ్మశక్యంకాని రీతిలో లాభాలొచ్చాయి.

Published : 01 Dec 2022 02:38 IST

ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాక్‌ చేసి ఫాలోవర్లకు మెసేజ్‌లు

క్రిప్టో కరెన్సీ, పెట్టుబడులతో లాభాలంటూ సైబర్‌ మోసాలు

ఈనాడు- హైదరాబాద్‌: ‘‘హాయ్‌ డియర్‌.. నా పాకెట్‌ మనీతో నిన్న ఒక అద్భుతం జరిగింది. బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడితే నమ్మశక్యంకాని రీతిలో లాభాలొచ్చాయి. రూ.5 వేలు పెడితే మూడు గంటల్లో ఆ మొత్తం రూ.లక్ష అయ్యింది. కావాలంటే కింద ఉన్న స్క్రీన్‌షాట్‌ చూడు. నువ్వూ లింకు తెరిచి పెట్టుబడి పెట్టు’’ ఇలాంటి సందేశం మీ గర్ల్‌ఫ్రెండ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి వచ్చిందా..! ఏమిటని అడగకుండా లింకు తెరిచి పెట్టుబడి పెడితే మీరు నిండా మునిగినట్లే. సైబర్‌ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి వాడుతున్న ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా హ్యాక్‌ గురైతే పోతే పోయింది.. కొత్తది ప్రారంభించవచ్చని తేలిగ్గా వదిలేశారో.. అంతే సంగతులు..! మీ ఖాతా ద్వారా డబ్బు పంపాలంటూ స్నేహితులు, ఫాలోవర్లకు సందేశాలు పంపడంతోనే ఆగడం లేదు. పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలొస్తాయని, క్రిప్టోలో డబ్బు పెట్టాలంటూ నకిలీ లింకులు పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. కొన్ని నెలలుగా ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా హ్యాక్‌ చేస్తున్న కేసులు నగరంలో గణనీయంగా పెరుగుతున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు.

ఎక్కువుంటే అంతే..!

ప్రముఖులతో పాటు.. వంటలు, సరదా వీడియోలు చేసేవారికి ఇన్‌స్టాగ్రామ్‌లో భారీఎత్తున ఫాలోవర్లు ఉంటున్నారు. పాస్‌వర్డ్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం.. నేరగాళ్లకు అవకాశంగా మారుతోంది. హ్యాక్‌ చేసి.. స్నేహితులకు, ఫాలోవర్లకు పెట్టుబడులు పెట్టాలంటూ లింకులు పంపుతున్నారు. తొలుత లాభాలు వచ్చినట్లు చూపించే నిందితుడు.. భారీగా సొమ్ము పెట్టాక.. డబ్బు తీసుకునేందుకు వీలు లేకుండా చేస్తాడు. ఖాతా నిర్వహించే అసలు వ్యక్తికి ఫోన్‌ చేస్తేగానీ అసలు విషయం తెలియడం లేదు.

మహిళల  ఖాతాలే లక్ష్యం

హ్యాక్‌కు గురయ్యే ఖాతాల్లో ఎక్కువగా మహిళలు, యువతులకు సంబంధించినవే ఉంటున్నాయి. యువతులు, మహిళలు రీల్స్‌ ఎక్కువగా పోస్టు చేస్తుంటారు. వీరి ఖాతాను అనుసరించే వాళ్లు ఎక్కువ మంది ఉంటారు. నేరగాళ్లు వారి ఖాతాలను తేలిగ్గా హ్యాక్‌ చేసి ఫాలోవర్లకు నకిలీ లింకులు పంపిస్తున్నారు. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇలా రూ.30 లక్షలు మోసపోయాడు.


ధైర్యంగా ఫిర్యాదు చేయాలి

జి.శ్రీధర్‌, సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ

‘సామాజిక మాధ్యమ ఖాతా హ్యాక్‌కు గురైనా.. వాటి ద్వారా స్నేహితులకు లింకులు పంపించినట్లు తెలిసిన వెంటనే పోలీసుల్ని సంప్రదించాలి. పెట్టుబడులతో డబ్బు మోసపోయిన వారు ఆలస్యం చేయకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. 1930కి ఫోన్‌ చేసి సంప్రదించవచ్చు.


కనీసం 12 అక్షరాలుండాలి..

అడ్లకాడి రంజిత్‌, ఎథికల్‌ హ్యాకర్‌

‘పాస్‌వర్డ్‌ నంబర్లు, అక్షరాలు, సంజ్ఞలతో సంక్లిష్టంగా ఉండాలి. కనీసం 12 అక్షరాలకు ఉండాలి. స్నేహితులు ఎంత దగ్గరి వారైనా వారి సామాజిక మాధ్యమాల ఖాతాల నుంచి వచ్చే లింకుల్ని నమ్మకూడదు.’’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని