logo

స్థానికంలో రాజకీయ కాక!

నగర శివారుల్లో రాజకీయ వేడి మొదలైంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్‌ లేదా మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు మూడేళ్ల పదవీ కాలం పూర్తి కావాలి.

Published : 01 Dec 2022 02:37 IST

శివారు మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో  వేడెక్కిన పరిస్థితులు

అవిశ్వాసాలకు సిద్ధమవుతున్న వైరి వర్గీయులు

ఈనాడు, హైదరాబాద్‌: నగర శివారుల్లో రాజకీయ వేడి మొదలైంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్‌ లేదా మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు మూడేళ్ల పదవీ కాలం పూర్తి కావాలి. వచ్చే జనవరి 25 నాటికి మూడేళ్ల పదవీ కాలం పూర్తి కానుండటంతో వ్యతిరేక వర్గాలు ఈ ప్రయత్నాల్లో మునిగాయి.  

మూడేళ్లలో మార్పులెన్నో..

హైదరాబాద్‌ చుట్టుపక్కల 22 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లు ఉన్నాయి. అధిక స్థానాల్లో తెరాస తరఫున గెలిచిన నాయకులే ఛైర్మన్లు, మేయర్లుగా కొనసాగుతున్నారు. ఆదిభట్ల, తుర్కయాంజల్‌ మున్సిపాలిటీలతోపాటు బడంగ్‌పేట కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ నాయకులు ఛైర్మన్లుగా ఉన్నారు. తుక్కుగూడ, ఆమన్‌గల్‌లో భాజపా నాయకులు ఛైర్మన్లుగా ఉన్నారు. జల్‌పల్లిలో ఎంఐఎం, మణికొండలో కాంగ్రెస్‌, భాజపా సంయుక్తంగా అధికారంలో ఉన్నాయి. మిగిలిన చోట్ల తెరాస నాయకులే ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. గత మూడేళ్లలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొందరు ఛైర్మన్లు ఒక పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీలోకి చేరారు. ప్రత్యర్థి పార్టీలు గుర్రుగా ఉన్నాయి. వారిపై అవిశ్వాసం పెట్టేందుకు తెర వెనుక వ్యూహాలు రచిస్తున్నాయి. దీనికితోడు అధికార తెరాస పాలన కొనసాగుతున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ వర్గ పోరుతోనూ ప్రతిపాదనలు నడుస్తున్నాయి.


ఇదీ  పరిస్థితి..

జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లో మేయర్‌ కావ్య నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయంటూ పలువురు కార్పొరేటర్లు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. మొత్తం 28 డివిజన్లలో దాదాపు 20 మంది కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

బడంగ్‌పేట కార్పొరేషన్‌లో 32 డివిజన్లు ఉన్నాయి. 13 తెరాస, పది భాజపా, ఏడు కాంగ్రెస్‌, ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. ఇద్దరు స్వతంత్రులు తెరాసకు మద్దతుగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన పారిజాత తెరాస మద్దతుతో మేయర్‌ అయ్యారు. ఆ తర్వాత తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఆమె తీరుపై తెరాస గుర్రుగా ఉండటంతో ఇతరులు లేదా ఎక్స్‌అఫీషియో సభ్యుల మద్దతుతో అవిశ్వాసానికి ప్రయత్నించే అవకాశం ఉంది.

బండ్లగూడ కార్పొరేషన్‌లో కార్పొరేటర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. మేయర్‌ మహేందర్‌గౌడ్‌, డిప్యూటీ మేయర్‌ రాజేందర్‌రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయిలో నడుస్తున్నాయి. మేయర్‌పై ఇప్పటికే పలు పర్యాయాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 22 మంది కార్పొరేటర్లు ఉండగా.. 14 మంది తెరాస, నలుగురు కాంగ్రెస్‌, ఇద్దరు భాజపా, ఒకరు ఎంఐఎంకు చెందినవారు. ఒక స్థానం ఖాళీగా ఉంది. మేయర్‌ను దించాలని వ్యతిరేక వర్గం ప్రయత్నాల్లో ఉంది.

దమ్మాయిగూడలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ప్రణీత విషయంలో సొంత పార్టీ కౌన్సిలర్లే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 18 వార్డులకు మూడు కాంగ్రెస్‌ ఖాతాలో ఉన్నాయి. 15 మంది కౌన్సిలర్లు తెరాస తరఫున ఉన్నారు. వారిలో మెజార్టీ సభ్యులు అవిశ్వాసం తీసుకొస్తామని చెబుతున్నారు.

ఆదిభట్లలో కాంగ్రెస్‌లో గెలిచి తెరాస మద్దతుతో ఆర్తిక ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఇక్కడ 15 మంది కౌన్సిలర్లు ఉండగా.. ఎనిమిది మంది కాంగ్రెస్‌, ఆరు తెరాస, ఒకరు భాజపా తరఫున ఉన్నారు. తెరాస నాలుగు ఎక్స్‌అఫీషియో సభ్యుల మద్దతుతో ఆర్తికను ఛైర్‌పర్సన్‌ను చేసింది. తర్వాత ఆమె తిరిగి కాంగ్రెస్‌లోకి మారడంతో ఆమెను దించేందుకు తెరవెనుక వ్యూహాలు నడుస్తున్నాయి.

బోడుప్పల్‌లో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ మధ్య విభేదాలు నడుస్తున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయారు. పీర్జాదిగూడలోనూ ఇదే పరిస్థితి.

పోచారం, ఘట్‌కేసర్‌లో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ మధ్య విభేదాల నేపథ్యంలో అవిశ్వాసానికి వ్యూహాలు రచిస్తున్నారు.

తుక్కుగూడ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక ఆది నుంచి ఎంతో కీలకంగా మారింది. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన మదన్‌మోహన్‌ తెరాస మద్దతుతో ఛైర్మన్‌ అయ్యారు. కొన్ని నెలల కిందట ఆయన భాజపాలో చేరారు. తెరాసకు ఐదుగురు, భాజపాకు తొమ్మిది కౌన్సిలర్లుండగా.. ఎక్స్‌అఫీషియా సభ్యుల మద్దతుతో గులాబీ దళం మరోసారి వ్యూహాలు అమలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని