logo

అవుటర్‌ లీజుపై ముందుకు!

మహానగరానికి మణిహారం లాంటి అవుటర్‌ రింగ్‌ రోడ్డు లీజు వ్యవహారంపై హెచ్‌ఎండీఏ కసరత్తు ముమ్మరం చేసింది. టోల్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ (టీవోటీ) విధానంలో ప్రైవేటు సంస్థకు 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Updated : 07 Dec 2022 12:59 IST

ఆర్‌ఎఫ్‌పీ కోసం టెండర్లు పిలిచిన హెచ్‌ఎండీఏ
ఈనాడు, హైదరాబాద్‌

మహానగరానికి మణిహారం లాంటి అవుటర్‌ రింగ్‌ రోడ్డు లీజు వ్యవహారంపై హెచ్‌ఎండీఏ కసరత్తు ముమ్మరం చేసింది. టోల్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ (టీవోటీ) విధానంలో ప్రైవేటు సంస్థకు 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. టీవోటీ విధానాల రూపకల్పన, లాభదాయక నమూనాను సూచించడానికి లావాదేవీల సలహాదారు (ట్రాన్స్‌క్షన్‌ అడ్వయిజర్‌)ను నియమించేందుకు రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ)ను మూడు నెలల క్రితం ఆహ్వానించింది. గడువులోపు పలు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. తాజాగా నానక్‌రాంగూడలోని అవుటర్‌ రింగ్‌రోడ్డు కార్యాలయంలో ప్రీ బిడ్డింగ్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అధికారులు ఆయా సంస్థలతో సంప్రదింపులు జరిపారు. లీజుకు ఇవ్వనున్న దృష్ట్యా హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలకు అనుగుణంగా నిబంధనలు, ఇతర అంశాలు ఉండేలా ఆర్‌ఎఫ్‌పీ రూపకల్పనకు వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. సదరు సంస్థలు కూడా తమ ప్రతిపాదనలను అధికారుల ముందు ఉంచాయి. సాంకేతిక, ఆర్థిక బిడ్లలో అర్హత సాధించిన సంస్థను ట్రాన్స్‌క్షన్‌ అడ్వయిజర్‌గా నియమించనున్నారు. ఇందులో భాగంగా ఈనెల 21 సాంకేతిక బిడ్లను తెరవనున్నారు.

* ప్రస్తుతం అవుటర్‌ రింగ్‌ నిర్వహణ హెచ్‌ఎండీఏ చూస్తోంది. వాహనాల నుంచి టోల్‌ను ప్రైవేటు సంస్థలు వసూలు చేసి..హెచ్‌ఎండీఏకు చెల్లిస్తున్నాయి. లీజు తర్వాత అవుటర్‌ నిర్వహణ నుంచి టోల్‌ వసూళ్లు అన్నీ.. ఇక ప్రైవేటు సంస్థల చేతిలోకి వెళ్లనుంది. నిర్ణీత లీజు మొత్తం హెచ్‌ఎండీఏకు చెల్లించనుంది. దేశవ్యాప్తంగా పలు జాతీయ రహదారులను బీవోటీ (బిల్డ్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌) పద్ధతిలో నిర్వహిస్తున్నాయి. ఆయా రహదారులపై టోల్‌ వసూళ్ల నుంచి నిర్వహణ వరకు ఆయా సంస్థలే చూస్తున్నారు. ఒప్పందంలో భాగంగా ముందే ఆ ఆదాయాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయి. అవుటర్‌ రింగ్‌ రోడ్డును టీవోటీ పద్ధతిలో నిర్వహించడానికి ఇప్పటికే నిర్ణయించారు.

* నగరం చుట్టూ అవుటర్‌ రింగ్‌ రోడ్డు 158 కిలోమీటర్లు మేరకు నిర్మించారు. పలు జాతీయ, రాష్ట్ర రహదారులు  అనుసంధానమై ఉన్నాయి. అవుటర్‌ రింగ్‌రోడ్డుపై నిత్యం 1.70 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటి నుంచి టోల్‌ ఛార్జీలు వసూలు చేసేందుకు 2019లో హెచ్‌ఎండీఏ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. ఈగల్‌ ఇన్‌ఫ్రా అనే సంస్థకు టోల్‌ వ్యవస్థ కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.421 కోట్లు వరకు ఆదాయం సమకూరింది. ఆ లెక్కన 30 ఏళ్లపాటు ఏటా కొంత శాతం పెంపుతో లీజుకు ఇవ్వనున్నారు.

30 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యతలు

* అవుటర్‌ను హెచ్‌ఎండీఏ పరిధిలోని హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌(హెచ్‌జీఎల్‌) నిర్వహిస్తోంది. 159 కిలోమీటర్ల పొడవునా విద్యుత్తు లైట్లు, ఇంటర్‌ ఛేంజ్‌లు, సర్వీసు రహదారుల నిర్వహణ, భద్రత చూస్తోంది.
* లీజుకు ఇవ్వడంతో సదరు సంస్థే 30 ఏళ్లపాటు నిర్వహించనుంది. పర్యవేక్షణకే హెచ్‌జీఎల్‌ పరిమితం అవుతుంది. టీవోటీ విధానంలో ప్రైవేటు ఏజెన్సీ ద్వారా టోల్‌ ఆదాయాన్ని విడలత వారీగా కాకుండా ముందస్తుగానే ప్రభుత్వానికి అందించనుంది. ఇలా ఒకేసారి రూ.4-5 వేల కోట్లు ప్రభుత్వానికి చేరనుంది.  
*ఈ భారీ మొత్తంతో ఏదైనా మౌలిక వసతుల ప్రాజెక్టులకు చేపట్టడానికి ప్రభుత్వానికి వెసులుబాటు ఏర్పడుతుంది. టీవోటీ కింద లీజు దక్కించుకున్న సంస్థ రోడ్ల మరమ్మతులు, నిర్వహణ పనులు చూడాల్సి ఉంటుంది.
* ఇంటర్‌ ఛేంజ్‌లు, సర్వీసు ఇతర ప్రాంతాల్లో వాణిజ్య, వ్యాపార కూడళ్లను అభివృద్ధి చేసి ఆదాయ సముపార్జన ఇతరత్రా రెవెన్యూను పరిగణలోకి తీసుకుంటే భవిష్యత్తులో అవుటర్‌ ప్రభుత్వానికి బంగారుబాతుగా మారునుంది.
*మరోవైపు లీజు పేరుతో హెచ్‌ఎండీఏ ప్రైవేటు సంస్థలకు ధారదత్తం చేస్తోందనే విమర్శలు లేకపోలేవు. అధికారులు ఈ విమర్శల్ని కొట్టి పారేస్తున్నారు. అదే మేలని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని