MLAs Bribery case: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. హైకోర్టులో సిట్‌ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఏసీబీ ప్రత్యేక కోర్టు మెమో తిరస్కరించడంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు పిటిషన్‌పై విచారణ జరిపేందుకు హైకోర్టు అంగీకారం తెలిపింది.

Published : 07 Dec 2022 12:08 IST

హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఏసీబీ ప్రత్యేక కోర్టు మెమో తిరస్కరించడంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, డా.జగ్గుస్వామి, తుషార్‌ వెల్లాపల్లి, బూసారపు శ్రీనివాస్‌లను నిందితులుగా చేరుస్తూ దాఖలు చేసిన మెమోను మంగళవారం ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సిట్ ఉన్నత న్యాయస్థానంలో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేసింది. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు పిటిషన్‌పై విచారణ జరిపేందుకు హైకోర్టు అంగీకారం తెలిపింది.

‘‘మొదటి ముగ్గురు నిందితుల నేరాంగీకార వాంగ్మూలంలో ఎక్కడా ఈ నలుగురి పేర్లు లేవు. ఎఫ్‌ఐఆర్‌, రిమాండ్‌ రిపోర్ట్‌ తదితరాల్లోనూ ఈ నలుగురి పాత్రపై ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు’’ అని ఏసీబీ కోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. ‘అవినీతి నిరోధక చట్టం కింద కేసుల్ని శాంతిభద్రతల పోలీసులుగాని, సిట్‌గాని దర్యాప్తు చేయకూడదనే అంశాన్నీ న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటోంది. ఏసీబీలాంటి స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ మాత్రమే ఇలాంటి కేసుల్ని విచారణ చేయొచ్చు. ఈ అంశాల ఆధారంగా ఆ నలుగురిని నిందితులుగా గుర్తించాలనే దర్యాప్తు అధికారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవడం లేదు’ అని మంగళవారం ఏసీబీ కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో సిట్‌ హైకోర్టును ఆశ్రయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని