logo

అనిశా వలలో విద్యుత్తు ఏఈ, బిల్‌ కలెక్టర్‌

యాఖుత్‌పుర సెక్షన్‌లోని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఏఈ, మీటరు రీడింగ్‌ బిల్‌ కలెక్టర్‌ ఓ వినియోగదారుడి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు.

Published : 08 Dec 2022 02:29 IST

రాజశేఖర్‌

చార్మినార్‌, న్యూస్‌టుడే: యాఖుత్‌పుర సెక్షన్‌లోని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఏఈ, మీటరు రీడింగ్‌ బిల్‌ కలెక్టర్‌ ఓ వినియోగదారుడి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. యాఖుత్‌పురకు చెందిన ఉస్మాన్‌షరీఫ్‌ తన పురాతన నివాసాన్ని కూల్చివేసి అదే ప్రాంతంలో కొత్తగా భవనాన్ని పునర్నిర్మిస్తున్నారు. ఆ ఇంటి విద్యుత్తు మీటరుపై కొంత బిల్లు బకాయి ఉంది. దాన్ని మాఫీ చేసి కొత్త మీటరు ఇవ్వడానికి యాఖుత్‌పుర సెక్షన్‌లోని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఏఈ కె.రాజశేఖర్‌, ఆర్టిజన్‌ గ్రేడ్‌-2 మీటరు రీడర్‌ బిల్‌ కలెక్టర్‌ మహ్మద్‌ జమాల్‌ రూ.50వేలు డిమాండ్‌ చేశారు. అంత ఇచ్చుకోలేనని రూ.40 వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇటీవల తొలివిడతగా రూ.20 వేలను వారికి ఇచ్చారు. రెండో విడత రూ.20 వేల కోసం ఉస్మాన్‌షరీఫ్‌పై ఒత్తిడి తీసుకురావడంతో పాటు వేధించసాగారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారి ఫయాజ్‌ కెమికల్‌ పూసిన నోట్లను ఉస్మాన్‌షరీఫ్‌కు ఇవ్వడంతో వాటిని రాజశేఖర్‌, మహ్మద్‌ జమాల్‌కు ఇచ్చారు. అక్కడి పరిసరాల్లో నిఘా కొనసాగించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు, సిబ్బంది ఏసీబీ అధికారి ఫయాజ్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో దాడులు చేసి రాజశేఖర్‌, మహ్మద్‌ జమాల్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది లంచం అడిగితే టోల్‌ ఫ్రీ నంబరు 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారి ఫయాజ్‌ అహ్మద్‌ విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని