logo

నగ్నంగా మార్చి నరకం

రౌడీయిజంతో దందాలకు పాల్పడుతున్న ముఠాలోని యువకుడు మరొకరితో జతకట్టడంతో ముఠా నాయకుడు కోపంతో రగిలిపోయాడు.

Published : 08 Dec 2022 02:29 IST

యువకుడి కిడ్నాప్‌ కేసులో ఐదుగురిపై కేసు నమోదు

యువకుడిని బెల్టుతో కొడుతున్న నిందితులు

రాజేంద్రనగర్‌, లంగర్‌హౌస్‌, న్యూస్‌టుడే: రౌడీయిజంతో దందాలకు పాల్పడుతున్న ముఠాలోని యువకుడు మరొకరితో జతకట్టడంతో ముఠా నాయకుడు కోపంతో రగిలిపోయాడు. దీంతో అతని అనుచరులతో కలిసి ఆ యువకుడిని నిర్బంధించి నగ్నంగా మార్చి 4 గంటలపాటు నరకం చూపాడు. హైదరాబాద్‌ నగర శివారు కిస్మత్‌పేట్‌లో జరిగిన ఈ దారుణం సామాజిక మాధ్యమాల ద్వారా బుధవారం వెలుగు చూసింది. బాధితుడి ఫిర్యాదుతో రాజేంద్రనగర్‌, లంగర్‌హౌస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, బాధితుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..బండ్లగూడ జాగీర్‌ ప్రాంతానికి చెందిన యువకుడు(18) కారు డ్రైవర్‌. మంగళవారం మధ్యాహ్నం కారు సర్వీసింగ్‌కు ఇచ్చేందుకు లంగర్‌హౌస్‌ వచ్చాడు. తమ ముఠా నుంచి విడిపోయి మరొకరితో జతకట్టాడనే కోపంతో ఉన్న రౌడీషీటర్‌ ఇర్ఫాన్‌(30) తన అనుచరులు ముదాసిర్‌, జహీద్‌, ఫవాజ్‌, షహేన్‌షాతో సర్వీసింగ్‌ సెంటర్‌కు వచ్చిన యువకుడికి కిడ్నాప్‌ చేసి కిస్మత్‌పూర్‌లోని పాత భవనంలో బంధించారు. అప్పటికే అక్కడకు చేరిన మరో 10 మందితో కలసి బాధితుడిని నగ్నంగా మార్చారు. తమ మాట వినకుండా మరో ముఠాలో చేరడంపై మండిపడుతూ బెల్టుతో దాడిచేశారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ పరుగులు పెట్టిస్తూ భౌతికదాడి చేశారు. తమను కాదని ముఠా నుంచి బయటకెళితే ఇలాంటి పరిస్థితే ఉంటుందంటూ హెచ్చరికలు చేశారు. దాడిని అక్కడున్న వారు వీడియోలు తీసి హిందీ సినిమా పాటను జతచేసి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. బుధవారం ఉదయం ఈ వీడియోలతో దాడి ఘటన బయటపడింది. బాధితుడి ఫిర్యాదుతో లంగర్‌హౌస్‌, రాజేంద్రనగర్‌ పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. దాడితో ప్రమేయం ఉన్న మరో 10 మంది వివరాలు సేకరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని