logo

నకిలీ ఆధార్‌లతో వాహనాల అమ్మకాలు

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయాల్లో కొందరు ఆర్టీఏ ఏజెంట్లు నకిలీ ఆధార్‌ కార్డులతో థర్డ్‌ పార్టీలకు ద్విచక్ర వాహనాలు, ఆటోలను అమ్మిస్తున్నారు.

Published : 08 Dec 2022 02:19 IST

రూ.కోట్లలో దందాలు.. ఆర్టీఏ ఏజెంట్ల హస్తలాఘవం
రవాణా శాఖ కార్యాలయాల్లో సెటిల్‌మెంట్లు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయాల్లో కొందరు ఆర్టీఏ ఏజెంట్లు నకిలీ ఆధార్‌ కార్డులతో థర్డ్‌ పార్టీలకు ద్విచక్ర వాహనాలు, ఆటోలను అమ్మిస్తున్నారు. ఆయా వాహనాల యజమానులు ఉన్నా.. చనిపోయినా సరే... నకిలీ ఆధార్‌ వివరాలతో మరో వ్యక్తిని తీసుకువస్తున్నారు. వాహన యజమానిగా అతడిని చూపిస్తున్నారు. ఆధార్‌, ఇతర గుర్తింపు పత్రాలు సక్రమంగా ఉండడంతో రవాణాశాఖ అధికారులు సంతకాలు పెడుతున్నారు. ఇటీవల దక్షిణ మండలంలోని కొందరు ఆర్టీఏ ఏజెంట్లు మరణించిన వ్యక్తి ఆధార్‌ కార్డుకు నకిలీ తయారు చేసి మరో వ్యక్తితో ఆటో అమ్మించేశారు. రవాణాశాఖ ఉన్నతాధికారులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. తాజాగా తిరుమలగిరిలో అక్రమాలకు పాల్పడుతున్న ఆర్టీఏ ఏజెంట్‌ నరేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.

నకిలీ ఆధార్‌ కార్డులతో వాహన విక్రయాలు మలక్‌పేట, బహదూర్‌పురా, ఉప్పల్‌, తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయాల్లో జరుగుతున్నాయి. ఇలా నకిలీ ఆధార్‌ కార్డులతో ఒక్కో ఆటోకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు వరకు సంపాదిస్తున్నారు. ఇందులో రవాణాశాఖ కిందిస్థాయి సిబ్బందికి, ఒకరిద్దరు అధికారులకు పర్సెంటేజీ అందుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆటోలు, ద్విచక్ర వాహనాలు..

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కొత్త ఆటోల రిజిస్ట్రేషన్లపై నిషేధం ఉండడంతో నడవని, పాత ఆటోల వివరాలను కొందరు అక్రమార్కులు సేకరిస్తున్నారు. అవి ఎవరి పేర్లతో ఉన్నాయో తెలుసుకుంటున్నారు. వాటి  యజమానుల వివరాలు సేకరించి.. వారు హైదరాబాద్‌లో ఉన్నారా? లేదా? ఆటోలు నడుపుతున్నారా? లేదా? ఇంకెవరికైనా విక్రయించారా? అనే వివరాలను తెలుసుకుని రవాణాశాఖ సిబ్బందితో వాటి యజమానుల చిరునామాలు సేకరిస్తున్నారు. రవాణాశాఖ కార్యాలయాలు రద్దీగా ఉండే సమయాల్లో వెళ్తున్నారు. ఆటో యజమానులు వీరేనంటూ అధికారులను నమ్మించి యాజమాన్య హక్కు బదిలీ చేయిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని