logo

నిఘా నీడలో దేహదారుఢ్య పరీక్షలు

రాత పరీక్షలో అర్హత సాధించిన పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్సై అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలకు కొండాపూర్‌ టీఎస్‌ఎస్‌పీ 8వ బెటాలియన్‌ పరేడ్‌ మైదానంలో కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసినట్లు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు.

Published : 08 Dec 2022 02:29 IST

సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర

ఎత్తు కొలిచే యంత్రం పనితీరును పరిశీలిస్తున్న సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర

రాయదుర్గం, సరూర్‌నగర్‌, న్యూస్‌టుడే: రాత పరీక్షలో అర్హత సాధించిన పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్సై అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలకు కొండాపూర్‌ టీఎస్‌ఎస్‌పీ 8వ బెటాలియన్‌ పరేడ్‌ మైదానంలో కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసినట్లు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. బుధవారం ఆయన మైదానాన్ని సందర్శించారు. ఆయన మాట్లాడుతూ పకడ్బందీ సాంకేతికతతో.. నిఘా నీడలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మానవ ప్ర£మేయం లేకుండా.. ప్రతి అంశం రికార్డవుతుందని, ఎలాంటి అక్రమాలకు తావుండదన్నారు. దళారుల  మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. జాయింట్‌ సీపీ అవినాశ్‌ మహంతి, డీసీపీలు విజయ్‌కుÛమార్‌, స్నేహా మెహ్రా, ఇందిర, లావణ్య, టీఎస్‌ఎస్‌పీ 8వ బెటాలియన్‌ కమాండెంట్‌ మురళీ కృష్ణ ఉన్నారు. పరీక్షలకు 25,700 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. 20,500 మంది పురుషులు, 5200 మంది మహిళలు. ఈ నెల 8 నుంచి జనవరి 3 వరకు పరీక్షలు కొనసాగుతాయి. మహిళలకు ఈ నెల 10, 12, 13, 14వ తేదీల్లో పరీక్షలు ఉంటాయి.

సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో..

రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన పోలీస్‌ ఉద్యోగ అభ్యర్థులకు కీలకమైన దేహదారుఢ్య పరీక్షలకు అధికారులు సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం మైదానంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి అధునాతన సాంకేతికతను ఉపయోగించి వీటిని నిర్వహించనున్నారు. కొన్ని రోజులుగా సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ అదనపు డీసీపీ షమీర్‌ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాట్లు జరిగాయి. నేటి నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు 25 వేల మంది అభ్యర్థులకు పరీక్షలు జరుగుతాయి. లోపాలకు ఆస్కారం లేకుండా మెరుగైన ప్రమాణాలతో ట్రాక్‌ను, ప్రతి ఈవెంట్‌ రికార్డ్‌ అయ్యేలా 30 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రిస్ట్‌బ్యాండ్‌ని ప్రతి అభ్యర్థి చేతికి అమర్చుతామన్నారు. దీనిలో ఆ వ్యక్తి పాల్గొనే పరీక్షలకు సంబంధించిన వివరాలు రికార్డ్‌ అయి ఉంటాయి.  తొలుత పురుషులకు 1600 మీటర్లు, మహిళలకు 400 మీటర్లు పరుగుతో ఈవెంట్‌ ప్రారంభమవుతుంది. 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని