logo

వినియోగదారులకు మెరుగైన సేవలు

వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కం) కసరత్తు చేస్తోంది.

Published : 08 Dec 2022 02:29 IST

మరింత సమీపానికి సెక్షన్‌ కార్యాలయాలు

ఈనాడు, హైదరాబాద్‌: వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కం) కసరత్తు చేస్తోంది. మేడ్చల్‌, రంగారెడ్డి జోన్లలోని 5 సర్కిళ్లలో అధిక కనెక్షన్లున్న సెక్షన్లు, డివిజన్లను విభజించి కొత్తవి ఏర్పాటు చేయబోతోంది. గ్రేటర్‌లో 9 విద్యుత్తు సర్కిళ్లుండగా సబ్‌ డివిజన్లు, సెక్షన్లు ఒక్కోచోట ఒక్కోలా ఉన్నాయి. కొన్ని సర్కిళ్లలో 9 సబ్‌డివిజన్లుంటే కొన్నిచోట్ల ఐదారే ఉన్నాయి. సైబర్‌సిటీ సర్కిల్‌లో గండిపేట కొత్తగా సబ్‌ డివిజన్‌ చేసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. నిజాంపేట, కుత్బుల్లాపూర్‌ వంటి ప్రాంతాలు పరిశీలనలో ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు సెక్షన్‌ కార్యాలయం దగ్గరలో ఉండేలా చూస్తున్నారు. బిల్లింగ్‌ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్తగా 8-10 సబ్‌ డివిజన్లు, 12-15 సెక్షన్లు కొత్తగా ఏర్పడే అవకాశాలున్నాయి. ‘శివారు ప్రాంతాల్లో కనెక్షన్ల వృద్ధి 10-15 శాతం ఉంటే నగరంలో 2 శాతమే ఉంది. వీటన్నింటి దృష్ట్యా శివార్లలో అవసరమైన చోట సెక్షన్ల విభజన చేయబోతున్నాం’ అని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు.
ఉపకేంద్రాలకు స్థలాల కొరత.. నగరంలో విద్యుత్తు డిమాండ్‌ స్థిరంగా కొనసాగుతుంటే.. శివార్లలో ఇళ్లు, విల్లాలు, కన్వెన్షన్‌ సెంటర్లు, గేమింగ్‌ సెంటర్లు, ఐటీ కార్యాలయాలు, డేటా సెంటర్లు, వేర్‌హౌసింగ్‌ కేంద్రాలు వస్తుండటంతో విద్యుత్తు డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. ఇప్పటికే కనెక్షన్ల సంఖ్య 57 లక్షల మార్కుకు చేరువైంది. ఏటా సగటున 2-3 లక్షల కొత్త కనెక్షన్లు పెరుగుతున్నాయి. డిస్కం కొత్తగా 15 వరకు 33కేవీ విద్యుత్తు ఉపకేంద్రాలను ప్రతిపాదించింది. వీటికి స్థలాల కొరత వేధిస్తోంది. స్థలాలు కేటాయించాలని కలెక్టర్లను కోరుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 400 ఉపకేంద్రాలున్నాయి. సెక్షన్లను పెంచడంతోపాటు శివార్లలో నెట్‌వర్క్‌ బలోపేతం కోసం సెంట్రల్‌ బ్రేక్‌ డౌన్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు