logo

Hyd Airport Metro: ఎయిర్‌పోర్టు మెట్రో.. రాయదుర్గ్‌లో ఇంటర్‌ఛేంజ్‌

విమానాశ్రయ మెట్రో నిర్మాణ పనులు వేగవంతం అయ్యేలా అలైన్‌మెంట్‌ ఖరారు, క్షేత్రస్థాయి డేటా సేకరణ పనుల కోసం రెండు సర్వే బృందాలను హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో సంస్థ ఏర్పాటు చేసింది.

Updated : 19 Dec 2022 07:47 IST

అమీర్‌పేట మాదిరి 2 స్టేషన్ల నిర్మాణం

విమానాశ్రయ మెట్రో మార్గం సర్వే ప్రారంభం

అధికారులకు సూచనలిస్తున్న ఎన్వీఎస్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: విమానాశ్రయ మెట్రో నిర్మాణ పనులు వేగవంతం అయ్యేలా అలైన్‌మెంట్‌ ఖరారు, క్షేత్రస్థాయి డేటా సేకరణ పనుల కోసం రెండు సర్వే బృందాలను హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో సంస్థ ఏర్పాటు చేసింది. మెట్రో స్తంభాలు, వయాడక్ట్‌, మెట్రోస్టేషన్ల నిర్మాణం, ఎక్కడ ఎంత ఎత్తు ఉండాలనే విషయంలో డేటా కీలకం. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం ప్రాజెక్ట్‌ కోసం ఇప్పటికే రూపొందించిన సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) అనుగుణంగా బృందాలు క్షేత్రస్థాయిలో సర్వే చేయనున్నాయి. సర్వేను ఆదివారం ఎయిర్‌పోర్ట్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ప్రారంభించి ఇంజినీర్లతో కలిసి రాయదుర్గ్‌ నుంచి నార్సింగి కూడలి వరకు ప్రతిపాదిత మెట్రో మార్గాన్ని పరిశీలించారు. 10 కి.మీ. పొడవునా కాలినడకన పర్యటించి సూచనలు చేశారు.

విమానాశ్రయ ప్రయాణికులకు మాత్రమే కాకుండా మెట్రో కారిడార్‌ వెంట ఉండే ప్రాంతవాసులకు, ముఖ్యంగా శివార్లలో ఉండే తక్కువ ఆదాయ వర్గాల వారందరికీ ఉపయోగపడేలా ఉండాలని సీఎం కేసీఆర్‌ సూచించారని ఎండీ వివరించారు.  

అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌ మాదిరి నాలుగంతస్తుల్లో రాయదుర్గ్‌లో విమానాశ్రయ మెట్రో స్టేషన్‌ రాబోతుంది. కింద రెండు అంతస్తులను కొత్త లైన్‌ విమానాశ్రయ మెట్రో స్టేషన్‌కి, పైన రెండు అంతస్తులను పాత కారిడార్‌-3 కారిడార్‌ పొడిగింపు స్టేషన్‌ కోసం వినియోగించనున్నారు. దీని కోసం ఐకియా భవనం తర్వాత, ఎల్‌ అండ్‌ టీ, అరబిందో భవనాల ముందు ఒకదానిపై ఒకటి రెండు స్టేషన్లు నిర్మించే అవకాశాన్ని పరిశీలించాలని సర్వే బృందాలకు సూచించారు. పక్కనే ఉన్న ట్రాన్స్‌కో 400కేవీ విద్యుత్తు ఉపకేంద్రానికి సంబంధించిన భూగర్భ కేబుళ్లను మార్చాలంటే ఎక్కువ ఖర్చు, సమయం పడుతుంది కాబట్టి ఆ అవసరం లేకుండా ప్రవేశమార్గాలు ఉండాలని సూచించారు.

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్లను అనుకుని మెట్రో స్తంభాల నిర్మాణం ఉండేలా చూడాలని.. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలన్నారు. భవిష్యత్తులో నిర్మించే బీహెచ్‌ఈఎల్‌-లక్డీకాపూల్‌ మెట్రో కారిడార్‌ అవసరాలను సైతం దృష్టిలో పెట్టుకోవాలన్నారు.

నానక్‌రాంగూడ కూడలి వద్ద మెట్రోస్టేషన్‌ నిర్మాణానికి సంబంధించి చుట్టుపక్కల కాలనీలు, వాణిజ్య కేంద్రాల నుంచి కాకుండా ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి వచ్చే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. పార్కింగ్‌ కోసం సమీపంలో ఖాళీ ప్రభుత్వ భూములను పరిశీలించాలన్నారు. ఎండీ వెంట చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ డీవీఎస్‌ రాజు, చీఫ్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ బి.ఆనందమోహన్‌, జీఎంలు ఎం.విష్ణువర్ధన్‌రెడ్డి, రాజేంద్ర ప్రసాద్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని