logo

క్రికెటర్లతో ఫొటోషూట్‌..రష్మికతో క్యాట్‌ వాక్‌

నటి రష్మికా మందన్నా సహా సినీ ప్రముఖులు, క్రికెటర్లతో ప్రకటనల్లో నటించే అవకాశాలిప్పిస్తామంటూ భారీగా డబ్బు వసూలు చేస్తున్న దంపతులను సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 24 Jan 2023 05:52 IST

అవకాశాల పేరుతో మోసగిస్తున్న జంట అరెస్టు

అపూర్వ అశ్విన్‌

ఈనాడు- హైదరాబాద్‌: నటి రష్మికా మందన్నా సహా సినీ ప్రముఖులు, క్రికెటర్లతో ప్రకటనల్లో నటించే అవకాశాలిప్పిస్తామంటూ భారీగా డబ్బు వసూలు చేస్తున్న దంపతులను సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై బెంగళూరు, బాచుపల్లి, గచ్చిబౌలి ఠాణాల్లో ఒక్కోటి.. సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఠాణాలో రెండు కేసులున్నాయి. వీరి నుంచి రూ.15.60 లక్షలు, నాలుగు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. సైబర్‌క్రైమ్‌ ఏసీపీ శ్రీధర్‌ సోమవారం వివరాలు వెల్లడించారు.

రెండు చిత్రాల్లో నటించి..

మహారాష్ట్రలోని పుణెకు చెందిన అపూర్వ అశ్విన్‌ దావ్డా (47) 20 ఏళ్లు మోడలింగ్‌లో కొనసాగాడు. రెండు బాలీవుడ్‌ చిత్రాల్లోనూ నటించాడు. మోడలింగ్‌ రంగంలోనే ఉన్న నటాషా కపూర్‌(26)ను పెళ్లి చేసుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో చిన్నారులకు మోడలింగ్‌ అవకాశాల పేరుతో మోసాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రద్దీగా ఉండే మాల్స్‌ మేనేజర్లతో మాట్లాడి చిన్నారుల ర్యాంప్‌ వాక్‌లు నిర్వహించేవాడు.  

తొలుత మేకప్‌.. తర్వాత స్విచాఫ్‌

చిన్నారులతో కలిసి మాల్‌కు వచ్చే తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్లు సేకరించారు. చిన్నారులకు మేకప్‌ వేసి మాల్‌లో ర్యాంప్‌ వాకింగ్‌ చేయిస్తారు. వారి తల్లిదండ్రులను వారం తర్వాత నిందితురాలు నటాషా కపూర్‌ వాట్సాప్‌లో సంప్రదించి చిన్నారి యాడ్‌ ఫిల్మ్‌కు ఎంపికైందని, సినీనటులు, క్రికెటర్లతో నటించే అవకాశం వచ్చిందని చెబుతుంది. తర్వాత అశ్విన్‌ మాట్లాడి ప్యాకేజీ ఛార్జీలు, దుస్తులు, మేకప్‌ సహా అనేక పేర్లతో డబ్బు వసూలుచేసి ఫోన్‌ స్విచాఫ్‌ చేస్తారు. ఇదే తరహాలో.. నగరంలోని మదీనాగూడకు చెందిన గోపాలకృష్ణన్‌ కుమార్తెతో కొండాపూర్‌లో ఓ షాపింగ్‌ మాల్‌కు వెళ్లినప్పుడు వివరాలిచ్చారు. ఒక బిస్కెట్‌ తయారీ సంస్థ ప్రకటనలో రష్మిక మందన్నాతో నటించే అవకాశం వచ్చిందని అశ్విన్‌ఫోన్‌లో నమ్మించాడు. కాస్ట్యూమ్స్‌, ఫొటోషూట్‌ ఉంటుందని చెప్పి రూ.17.37 లక్షలు జమ చేయించుకున్నాడు. మోసమని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని