logo

పగలు గమనిస్తారు.. రాత్రుళ్లు దోచేస్తారు

రాత్రి పూట ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠా రాచకొండ సీసీఎస్‌ పోలీసులకు చిక్కింది. పగలు టైల్స్‌ పనిచేస్తూ.. తాళాలు వేసిన ఇళ్లను గమనించి రాత్రి కాగానే  దోపిడీ చేస్తున్నారు.

Published : 25 Jan 2023 01:47 IST

ఆరుగురు నిందితులు.. 34 చోట్ల చోరీలు

స్వాధీనం చేసుకున్న సొత్తును పరిశీలిస్తున్న సీపీ

ఈనాడు- హైదరాబాద్‌:  రాత్రి పూట ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠా రాచకొండ సీసీఎస్‌ పోలీసులకు చిక్కింది. పగలు టైల్స్‌ పనిచేస్తూ.. తాళాలు వేసిన ఇళ్లను గమనించి రాత్రి కాగానే  దోపిడీ చేస్తున్నారు. కేవలం నగదు, బంగారం, వెండి మాత్రమే చోరీ చేసే ఈ ముఠాలోని ఆరుగురిని మూడేళ్ల వ్యవధిలో 34 చోట్ల దోపిడీలు చేశారు. సెల్‌ఫోన్లు కూడా వినియోగించని ఈ ముఠాను భువనగిరి సీసీఎస్‌, మోత్కూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రూ.32.83 లక్షల విలువైన సొత్తు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీలు శ్రీబాల, సన్‌ప్రీత్‌సింగ్‌, నారాయణరెడ్డి, మురళీధర్‌తో కలిసి కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ మంగళవారం ఎల్బీనగర్‌లో కేసు వివరాలను వెల్లడించారు.

ఉద్యోగి ఇంట్లో చోరీతో అనుమానం.. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండకు చెందిన బొడిగె అశోక్‌(36), నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తికి చెందిన గుండెబోయిన చంద్రం(29), నూతి సతీశ్‌(38) 2007 నుంచి రాత్రిపూట ఇళ్లల్లో చోరీలు చేస్తున్నారు. ఒకసారి హయత్‌నగర్‌ పోలీసులు జైలుకు పంపించారు. 2019లో నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. బయటికొచ్చాక వీరికి పెదకాపర్తికి చెందిన బైరవోని స్వామి(35), బడే బాలకృష్ణ(35), గండసారి ఉపేందర్‌(32) తోడయ్యారు.  పగలు ఇళ్లల్లో టైల్స్‌ పనిచేస్తున్నట్లు నటిస్తారు. దూరంగా తాళాలు వేసిన ఇళ్లను గమనిస్తారు. రాత్రి కాగానే మద్యం తాగి చోరీలకు బయలుదేరతారు. ఇటీవల ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది. నేరం జరిగిన తీరు ఆధారంగా భువనగిరి సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్లు దేవెందర్‌, సైదయ్య బృందం అశోక్‌ మీద నిఘా పెట్టారు. అతణ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా డొంకంతా కదిలింది. ఒక్కో నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని