logo

విలువ తగ్గిస్తే అసలుకే ఎసరు

సరకు రవాణా, కొరియర్‌ సేవల్లో సంస్థలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్న కొందరు వ్యాపారులకు విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి.

Published : 25 Jan 2023 01:46 IST

సరకురవాణా, కొరియర్‌ సేవల్లో మభ్యపెడుతూ నష్టపోతున్న వైనం
వినియోగదారుల కమిషన్‌ను 
ఆశ్రయిస్తున్నా దొరకని పరిహారం

ఈనాడు, హైదరాబాద్‌: సరకు రవాణా, కొరియర్‌ సేవల్లో సంస్థలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్న కొందరు వ్యాపారులకు విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. రవాణా సమయంలో సరకుపోయినా, దొంగతనం జరిగినా, దెబ్బతిన్నా పూర్తి స్థాయి నష్టపరిహారం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవాణా చేసే ఉత్పత్తుల విలువ తక్కువగా చూపి మభ్యపెడుతూ బిల్లు తక్కువ చెల్లిస్తుండటంతో నష్టపరిహారం పొందక.. ఒకవేళ వచ్చినా అదే పరిమాణంలో వస్తుండటంతో రూ.లక్షలు నష్టపోవాల్సి వస్తోంది. ఈ తరహా ఘటనల్లో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించినా సాక్ష్యాధారాలు ప్రతికూలంగా ఉండటంతో కేసులు వీగిపోవడం లేదా తక్కువ పరిహారంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.  

దొంగలు ఎత్తుకుపోవడంతో

నాగోల్‌కు చెందిన ఓ వస్త్ర వ్యాపారి...గతేడాది  ముంబయి వెళ్లి రూ.5 లక్షల విలువైన దుస్తులు ఆర్డర్‌ ఇచ్చాడు. హైదరాబాద్‌కు సరకుతో వస్తున్న లారీ ట్రాన్స్‌పోర్టు సంస్థ ప్రతినిధుల్ని సంప్రదించారు. ఉత్పత్తుల విలువ తక్కువగా చూపడంతో రూ.6 వేలు చెల్లించి రశీదు తీసుకున్నారు.  మార్గమధ్యంలో  మొత్తం సరకుని దొంగలు ఎత్తుకెళ్లారని సమాచారం అందింది. బాధితుడు ట్రాన్స్‌పోర్టు సంస్థను సంప్రదిస్తే రశీదులో పేర్కొన్న మొత్తాన్ని చెల్లిస్తానని చెప్పడంతో అవాక్కయ్యాడు. వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించినా లాభం లేకపోయింది.

కథ అడ్డం తిరుగుతోంది!..  బేగం బజార్‌, సికింద్రాబాద్‌, కోఠి కేంద్రంగా జరిగే సరకు రవాణా సేవల ద్వారా రూ.వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది.  పెద్ద మొత్తంలో సరకు తీసుకొచ్చే క్రమంలో ట్రాన్స్‌పోర్టు సంస్థలను సంప్రదిస్తున్నారు. ఇందులో కొందరు వ్యాపారులు రవాణాఛార్జీలను తప్పించుకోవాలనే చేసే ప్రయత్నాలు అప్పుడప్పుడూ ఇలా బెడిసి కొడుతున్నాయి.

రూ.40 వేల ఉత్పత్తులు.. రూ.100కు వేలం

తిరుమలగిరికి చెందిన మరో వ్యక్తికీ ఇదే అనుభవం ఎదురైంది. రూ.40 వేల విలువైన ఉత్పత్తులకు కేవలం రూ.6 వేల విలువైందంటూ కేవలం రూ.115 బిల్లు చెల్లించడంతో 80 శాతం నష్టపోయారు. ఇతను వైద్య ఉత్పత్తుల విక్రయాల వ్యాపారం చేస్తున్నారు. కామారెడ్డికి పంపాలంటూ ఆర్టీసీ కార్గో సేవలను పొందారు. బాక్సుపై సంబంధిత వివరాలు నమోదు చేయకపోవడంతో అది చేరాల్సిన వ్యక్తులకు చేరలేదు. ఆర్టీసీ సంస్థ ఆ బాక్సును కార్గొ కార్యాలయంలోనే ఉంచి చివరకు రూ.100కు వాటిని వేలంలో విక్రయించింది. ఆలస్యంగా విషయం తెలియడంతో ఫిర్యాదీ సంబంధిత సంస్థను సంప్రదించినా, వినియోగదారుల కమిషన్‌లో సంప్రదించినా లాభం లేకపోయింది. ఆ బాక్సులో ఉంది రూ.40వేల ఉత్పత్తులున్నాయని చెప్పినా సంబంధిత నిరూపించే సాక్ష్యాలు లేకపోవడంతో కమిషన్‌ తీర్పుతో చివరికి ఆ ఆరువేలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని