Revanth Reddy: ఆ విషయం ఈటల రాజేందర్‌ మాటల్లోనే స్పష్టమైంది: రేవంత్‌

భాజపాలో కూడా కోవర్టులు ఉన్నారని ఈటెల రాజేందర్‌ అన్న వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు స్పందించారు. ఆ పార్టీలో ఈటల అసంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక సతమతమవుతున్నారని రేవంత్‌ అన్నారు.

Updated : 27 Jan 2023 07:04 IST

హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth reddy) భాజపా (BJP) ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Etela rajender)ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించాలన్న లక్ష్యంతోనే ఈటల భాజపాలో చేరారని.. ఆ పార్టీ, కేసీఆర్‌ ఒక్కటే అన్న విషయం ఆయన మాటల్లోనే స్పష్టమైందని వ్యాఖ్యానించారు. భాజపాలో కూడా కేసీఆర్‌ (CM kcr) కోవర్టులు ఉన్నారని.. ఈటల పార్టీలో చేరిన తర్వాతనే ఆయనకు అర్థమైందన్నారు. ఇప్పుడు ఆయన లక్ష్యసాధన కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గురువారం మీడియాతో ఇష్టాగోష్టిగా రేవంత్‌ మాట్లాడారు.

అందుకే భాజపాకి ఓట్లు పడ్డాయి..

సీఎం కేసీఆర్‌కు ఆది నుంచి అంబేడ్కర్ మీద గౌరవం లేదని రేవంత్‌ ఆరోపించారు. కేసీఆర్ పుట్టిన రోజు కాకుండా, అంబేడ్కర్‌ పుట్టిన రోజు సచివాలయాన్ని ప్రారంభిస్తే గౌరవం ఉండేదని అభిప్రాయపడ్డారు. ఈటెల రాజేందర్‌, వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు.. భాజపా సిద్ధాంతాలను విశ్వసించరని పేర్కొన్నారు. భాజపా ఐడియాలజీతో ఈ ముగ్గురికి సంబంధం లేదన్న రేవంత్‌.. కేవలం కేసీఆర్‌ను మాత్రమే వ్యతిరేకిస్తారన్నారు. భాజపాలో కూడా కోవర్టులు ఉన్నారని ఈటెల అన్నారంటే.. ఆయన ఏదో అసంతృప్తిగా ఉన్నట్లే కాదా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈటల రాజేందర్‌ ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక సతమతమవుతున్నారని చెప్పారు. హుజూరాబాద్, మునుగోడులలో రెండు చోట్ల కూడా సందర్భానుసారమే భాజపాకి ఓట్లు పడ్డాయన్నారు. మిగతా సందర్భాలలో ఆ ఓట్లు కూడా పడేవి కావని వ్యాఖ్యానించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారని, హైకమాండ్‌ ఆ బాధ్యతలు ఆయనకు అప్పగించిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మరింత కఠినతరం చేయనున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పుడు వయో పరిమితి 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తామని వెల్లడించారు. 21 ఏళ్లకే కలెక్టర్‌ అయ్యేందుకు అవకాశం కల్పించినప్పుడు.. ఎమ్మెల్యే అయితే తప్పేముందని రేవంత్‌ అభిప్రాయపడ్డారు.

కేసీఆర్‌ తన వ్యవహార శైలి మార్చుకోవాలి..

సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రిపబ్లిక్‌ డేను ప్రగతిభవన్‌, రాజ్‌భవన్‌కే పరిమితం చేశారని మండిపడ్డారు. గణతంత్ర వేడుకను వివాదాలకు వేదిక చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌, సీఎం మధ్య విభేదాలుంటే మరో వేదికపై ప్రదర్శించాలి కానీ, గణతంత్ర వేడుకను వేదిక చేసుకోవడం సరికాదని హితవు పలికారు. సీఎం కేసీఆర్‌ తన వ్యవహార శైలి మార్చుకోవాలని సూచించారు. సీఎం వెంటనే గవర్నర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని