logo

దిశ మార్చిన ముఠాలు!

మత్తుమాఫియా, హవాలా తరలింపు ముఠాలు దిశ మార్చుకున్నాయి. కొద్దికాలం క్రితం వరకు దక్షిణ మండలంలో పాగా వేసిన నేరస్థులు ఉత్తరంవైపు చేరుతున్నారు.

Published : 28 Jan 2023 02:33 IST

అక్రమార్కుల అడ్డాగా ఉత్తర మండలం
బంగారం, మత్తు మాఫియాకు చిరునామా

ఈనాడు, హైదరాబాద్‌- రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: మత్తుమాఫియా, హవాలా తరలింపు ముఠాలు దిశ మార్చుకున్నాయి. కొద్దికాలం క్రితం వరకు దక్షిణ మండలంలో పాగా వేసిన నేరస్థులు ఉత్తరంవైపు చేరుతున్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, జూబ్లీ బస్‌స్టేషన్‌ ద్వారా రాకపోకలకు అనువుగా ఉండటంతో అడ్డాగా మలచుకుంటున్నారు. అధికశాతం నిందితులు ఇక్కడే చిక్కడం అందుకు నిదర్శనం.
* బేగంపేట విమానాశ్రయంలోని కొరియర్‌ సంస్థలు కేంద్రంగా అంతర్జాతీయ డ్రగ్‌ ముఠా దందా చేసింది. డిసెంబరులో రూ.3.1కోట్ల విలువైన సూడోఎఫిడ్రిన్‌ స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్లలో ఈ ముఠా ఇక్కడినుంచే 100 కిలోల మత్తుపదార్థాలు విదేశాలకు చేరవేసినట్టు గుర్తించారు. ఇటీవల పాతబస్తీకి చెందిన చైన్‌స్నాచర్లు లంబా, జబా అనే పాత నేరస్థులతో కలిసి సికింద్రాబాద్‌ పాట్‌మార్కెట్‌ నుంచి బంగారు దుకాణాలకు పంపే వజ్రాలు, వెండి, బంగారు ఆభరణాలను దోచుకొని బీభత్సం సృష్టించారు. తాజాగా అదేచోట ఒక భవనంలో అగ్నిప్రమాదంలో రూ.5కోట్ల హవాలా సొమ్ము బూడిదైనట్టు సమాచారం.

నిఘా, తనిఖీలతో మారిన రూట్‌..

రెండేళ్లక్రితం వరకు బేగంబజార్‌, ఘాన్సీబజార్‌, గోషామహల్‌, బహదూర్‌పుర, చార్మినార్‌, మదీనా హవాలా, అక్రమ బంగారం తరలింపు కేంద్రాలుగా ఉండేవి. ఆధిపత్య పోరులో ముఠాల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. పోలీసుల నిఘా, తనిఖీలు పెరగటంతో ముఠాలు రాణిగంజ్‌, జనరల్‌బజార్‌, పాట్‌మార్కెట్‌, తిరుమలగిరి, బేగంపేటవైపు మళ్లాయి.
ఇరుకు వీధులు.. రహస్య కేంద్రాలు.. గతేడాది మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో సుమారు రూ.50-60కోట్ల మేర హవాలా సొమ్ము స్వాధీనంచేసుకున్నారు. వీటిలో అధికశాతం ఫార్మా, స్థిరాస్తి, గుట్కావ్యాపారుల సొమ్ముగా గుర్తించారు. తాజాగా బేగంపేట్‌ పోలీసులు రూ.4కోట్లు తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరమండల పరిధిలో వ్యాపార, వాణిజ్య ప్రాంతాల్లో కొందరు హవాలా దందా నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇరుకువీధుల్లో అపార్ట్‌మెంట్స్‌, పాత భవనాలను నగదు నిల్వకేంద్రాలుగా మార్చారు. పోలీసులు గుర్తించి వచ్చేలోపు మరోచోటికి పంపేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

రైల్వే స్టేషన్‌లో మకాం

కరడుగట్టిన నేరస్తులు, పిక్‌పాకెటర్లు, అంతరాష్ట్ర ముఠాలు, గొలుసుదొంగలు, మాదకద్రవ్యాల ముఠాలు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను షెల్టర్‌జోన్‌గా మార్చుకున్నాయి. హోటళ్లు, లాడ్జీల్లో బసకు ఆధార్‌ తప్పనిసరి చేయటంతో రూటు మార్చారు.
*నగరం, శివారు ప్రాంతాల్లో నేరాలకు పాల్పడిన వీరంతా రైల్వేస్టేషన్‌కు చేరుతున్నారు. సొంతూళ్లకు చేరేందుకు రైలెక్కుతున్నారు. లేదంటే ప్రయాణికుల ప్రాంగణాలు, వాహనాలు నిలిపే ప్రాంతాల్లో ప్రయాణికుల మాదిరిగా తలదాచుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని