Telangananews: ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక నిర్ణయం

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల విషయంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌బోర్డు (TSLPRB) నిర్ణయించింది.  

Updated : 29 Jan 2023 20:53 IST

హైదరాబాద్‌: ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్షలో బహుళ సమాధాన ప్రశ్న విషయంలో హైకోర్టు ఆదేశాల ప్రకారం తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌బోర్డు (TSLPRB)  కీలక నిర్ణయం తీసుకుంది. ఏడు ప్రశ్నల మార్కుల కారణంగా గతంలో ఫెయిల్‌ అయిన వారు తాజాగా కోర్టు ఆదేశాల ప్రకారం ఉత్తీర్ణులయ్యారు. ప్రిలిమ్స్‌లో 7 ప్రశ్నల విషయంలో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్షలో బహుళ సమాధాన ప్రశ్నల విషయంలో అందరికీ మార్కులు కలపాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఉత్తీర్ణులైన వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అప్పుడు ఉన్న హాల్‌ టికెట్ నంబర్లతో లాగిన్‌ అయ్యేందుకు అవకాశం కల్పించారు. 

ఈనెల 30 నుంచి వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి దేహదారుఢ్య పరీక్ష కోసం పార్ట్‌-2 అప్లికేషన్‌ సబ్‌మిట్‌ చేయాలని పోలీసు నియామక బోర్డు తెలిపింది. ప్రస్తుతం ప్రిలిమినరీలో ఉత్తీర్ణులై ఇప్పటికే దేహదారుఢ్య పరీక్ష పూర్తి చేసిన వారికి అవసరం లేదని స్పష్టం చేశారు.  దేహదారుఢ్య పరీక్షలో క్వాలిఫై అవ్వని వారి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పోలీసు నియామక బోర్డు తెలిపింది. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రిలిమినరీలో ఉత్తీర్ణులైన వారు ఫిబ్రవరి 1న ఉదయం 8గంటల నుంచి 5వ తేదీ రాత్రి 10గంటల వరకు పార్ట్‌-2 అప్లికేషన్‌ సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 8 ఉదయం 8గంటల నుంచి 12వ తేది రాత్రి 10గంటల వరకూ దేహదారుఢ్య పరీక్షల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. ఫిబ్రవరి 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ పరీక్షల కోసం హైదరాబాద్‌, సైబదాబాద్‌, సైబరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఆదిలాబాద్ ప్రాంతాల్లోని మైదానాల్లో 10 రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కసరత్తు చేస్తోంది. 

* ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షల్లో మల్టిపుల్‌ జవాబులున్న ప్రశ్నలకు మార్కులు కలపాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇది బీజేవైఎం కార్యకర్తలు, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థుల పోరాట విజయమన్నారు. హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పోరాడితే తప్ప స్పందించని నియంత ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగడం దురదృష్టకరమన్నారు.


* తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు నిర్ణయంపై ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ బల్మూరి స్పందించారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థుల న్యాయ పోరాటానికి నియామక బోర్డు దిగొచ్చిందన్నారు. తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగులకు ఎన్‌ఎస్‌యూఐ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని