sandoz: హైదరాబాద్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు చేయనున్న శాండోస్‌

హైదరాబాద్‌లో గ్లోబల్‌ క్యాపబిలిటీ కేంద్రం కేర్పాటు చేస్తున్నట్లు శాండోస్‌ సంస్థ తెలిపింది. తద్వారా 1800 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Published : 31 Jan 2023 17:15 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో మరో గ్లోబల్‌ క్యాపబిలిటీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు లైఫ్‌ సైన్సెస్‌ దిగ్గజ కంపెనీ శాండోస్‌ తెలిపింది. మొత్తం 1800 మంది ఉద్యోగులు ఈ కేంద్రంలో పని చేయనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా జీనోమ్‌ వ్యాలీలో అత్యాధునిక రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ లేబరేటరీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన శాండోస్‌ కంపెనీ సీఈవో రిచర్డ్ సెయ్ నోర్ ప్రతినిధి బృందం ఈ మేరకు వెల్లడించింది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తున్న కంపెనీకి మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ఫార్మాసిటీలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పిన కేటీఆర్‌.. ఈ రంగంలో అభివృద్ధి సాధించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.

శాండోస్ కంపెనీ ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో ఉన్న తన అత్యాధునిక రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపింది. తమ సంస్థ రానున్న రోజుల్లో ఆటోమేషన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రపంచ స్థాయి లేబరేటరీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ నగరంలో ఉన్న లైఫ్ సైన్సెస్ అనుకూల అంశాలే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. ఇప్పటికే తమ గ్రూప్ సంస్థ నోవార్టీస్ హైదరాబాద్ కేంద్రంగా భారీ ఎత్తున కార్యకలాపాలను నిర్వహిస్తోందని, తద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చే పరిశోధనలను ఇక్కడి నుంచి నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించింది.  తమ సంస్థ వెయ్యికి పైగా మాలిక్యూల్స్‌ని కలిగి ఉందని, దాదాపు పది బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తోందని చెప్పింది. హైదరాబాద్ కేంద్రంగా తమ కంపెనీ విస్తరణ, తమ భవిష్యత్తు ప్రణాళికలకు అనుకూలంగా ఉంటుందన్న ఆశాభావాన్ని కంపెనీ ప్రతినిధి బృందం వ్యక్తం చేసింది. కంపెనీ కార్యకలాపాలకు భవిష్యత్తు ప్రణాళికలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బృందం సభ్యులు మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు